- హోమ్›
- వార్తలు›
- డ్రాగన్ దేశంతో భారత్ కు చర్చలు అనవసరం...అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్
డ్రాగన్ దేశంతో భారత్ కు చర్చలు అనవసరం...అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్
By: Sankar Sun, 11 Oct 2020 1:32 PM
భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు.
కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్ ఓ బ్రియెన్ అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు.
ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు.