ఉత్తరప్రదేశ్లో పిడుగు పాటుకు 43 మంది మృతి
By: chandrasekar Tue, 02 June 2020 1:55 PM
శనివారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో
కూడిన భారీ వర్షాలు కురవగా అకాల వర్షానికి 43 మంది ప్రాణాలు కోల్పోయారు. యూపీలోని
పలు ప్రాంతంల లో పిడుగులు పడి 43 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ప్రకృతి
వైపరీత్యాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున
నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు తన
ప్రగాఢ సానుభూతి తెలిపిన యోగి ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని
సూచించారు. గాయపడినవారికి అవసరమైన చికిత్సను అందజేయాలని ఆయన పేర్కొన్నారు.
శనివారం కురిసిన
భారీవర్షాలు, పిడుగుల
పాటుకు ఉన్నావ్లో అత్యధికంగా 8 మంది, కన్నౌజ్లో
ఐదుగురు మరణించారు. లక్నో నగరంలో ఓ ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బహువా ప్రాంతంలో
ఈదురు గాలులతో ఓ ఇల్లు కూలి 55 ఏళ్ల వృద్ధుడు, కుసుంబీ
గ్రామంలో మరో వృద్ధుడు మృత్యువాత పడ్డారు. రాగల 24 గంటల్లో ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో
ఉరుములు, మెరుపులతోపాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో
ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ఆదివారం రాత్రి హెచ్చరికలు జారీచేసింది.
శుక్రవారం రాత్రి ఆగ్రాలో
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి
చారిత్రక కట్టడం తాజ్ మహల్ తీవ్రంగా దెబ్బతింది. తాజ్ మహల్ పైన ఉన్న పాలరాతి, ఎర్ర ఇసుకరాతి రెయిలింగ్స్ దెబ్బతిన్నాయి. చెక్కతో
చేసిన తాజ్మహల్ గేటు, పాలరాయి
రెయిలింగ్, రెండు
ఎరుపు సున్నపురాయి పలకలు దెబ్బతిన్నట్లు భారత పురావస్తు శాఖ అధికారి, ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణకార్ తెలిపారు. తాజ్
మహల్ చుట్టుపక్కల కూడా ఈదురుగాలులకు చాలా చెట్లు నేలకొరిగాయి. టిక్కెట్స్ కౌంటర్తో
పాటు పశ్చిమ ఎంట్రీ గేట్ దగ్గర పైవోట్ రాయి కూడా దెబ్బతిన్నట్లు అధికారి
చెప్పారు.
తాజ్మహల్ కట్టడం నుంచి ఓ
ఎరుపు చలువరాయి కింద పడింది. ఈ ప్రాంతంలో దాదాపు పది చెట్లు విరిగిపడ్డాయి.
నష్టాన్ని అంచనా వేసిన తర్వాత పునరుద్ధరణ పనులు చేపడతామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్
ఇండియా అధికారులు తెలిపారు.
పెనుగాలులకు తాజ్ మహల్
పరిసరాల్లోని పలు కార్లు, ఇతర
వాహనాలపై చెట్లు, భారీ
స్థాయి ప్రాకారాలు కూలి పడ్డాయి. దాదాపు 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల శిథిలాల
నుంచి ఆరేండ్ల బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. యమునా వైపున ఉండే కట్టడాలకు నష్టం
వాటిల్లిందని అధికారులు తెలిపారు.