అమెరికాలో జార్జి ఫ్లాయిడ్కు వేలాది మంది ఘన నివాళి
By: chandrasekar Wed, 10 June 2020 7:00 PM
అమెరికాలో
పెచ్చరిల్లుతున్న జాత్యహంకారానికి బలైన జార్జి ఫ్లాయిడ్కు వేలాది మంది ఘన
నివాళులర్పించారు. సోమవారం టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్లో ఉన్న ప్రైస్ చర్చ్
ప్రాంగణంలో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ఉంచారు. ఈ స్మారక కార్యక్రమానికి వేలాది మంది
హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పిడికిలి బిగించి నివాళులర్పించారు. ఫ్లాయిడ్
చిత్రాలు, 'ఐ
కాన్ట్ బ్రీత్' అన్న పదాలతో కూడిన టీషర్ట్లను ధరించారు. సుమారు ఆరు
గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్లాయిడ్కు నివాళులర్పించేందుకు ప్రజలు, ఉద్యమకారులు
గంటల కొద్దీ వేచివున్నారు. స్మారక కార్యక్రమం ముగిసిన అనంతరం మృతదేహాన్ని పోలీసుల
భద్రత మధ్య అక్కడి నుంచి గుర్రపు బండి ద్వారా నగరంలోని అంత్యక్రియలు జరిగే
ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా ఫ్లాయిడ్కు ఘన వీడ్కోలు పలికారు.
జార్జి ఫ్లాయిడ్ మృతికి
వ్యతిరేకంగా రెండు వారాలుగా భారీస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రధాన నగరాలతో పాటు ఇతర దేశాల్లో కూడా
నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, తదితర దేశాల్లోని నగరాల్లో వేలాది మంది రోడ్లపైకి
వచ్చి వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. పోలీసుల క్రూరత్వంపై నిరసన వ్యక్తం
చేస్తున్నారు. ప్రధానంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో భారీ ఆందోళనలు
కొనసాగుతున్నాయి.
అమెరికా వ్యాప్తంగా
జరుగుతున్న ఆందోళనలపై ట్రంప్ ఆదేశాల మేరకు పోలీసులు, ఇతర
బలగాలు ఆందోళనకారులపై అణచివేత వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఆందోళనకారులను
చెదరగొట్టేందుకు బాష్పవాయువు, రబ్బర్ బులెట్లు, పెప్పర్ వాయువును ప్రయోగిస్తున్నారు. రాష్ట్రాల
గవర్నర్లు ఆందోళనలను అణచివేయకుంటే సైన్యాన్ని రంగంలోకి దించుతామని అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ హూంకరించినా కూడా ఆందోళనకారులు వెనక్కు తగ్గలేదు. ట్రంప్
వ్యాఖ్యల నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఒకానొక సమయంలో ఆందోళనలకు బయపడిన
ట్రంప్ బంకర్లో దాక్కున్నట్లు పలు మీడియా సంస్థలు తమ కథనాల్లో వచ్చాయి.
జార్జి ఫ్లాయిడ్ హత్య
ఘటనకు వ్యతిరేకంగా శ్రీలంకలోని అమెరికా దౌత్యకార్యాలయం ఎదుట ఆందోళన జరిగింది. ఈ
సందర్భంగా పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు. జాతివివక్షపై నిరసన వ్యక్తం
చూస్తూ ఫ్రంట్లైన్ సోషలిస్టు పార్టీకి చెందిన కార్యకర్తలు అమెరికా ఎంబసీని
ముట్టిడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న పోలీసులు
అదుపులోకి తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు. కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలను
ఉల్లంఘించిన కారణంగా ఎఫ్ఎస్పి కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు
తెలిపారు.