ఫుట్బాల్ వీరుడు డిగోను కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు...
By: chandrasekar Fri, 27 Nov 2020 4:24 PM
అర్జెంటీనా ఫుట్బాల్
దిగ్గజం డిగో మారడోనా మృతితో శోక సంద్రంలో మునిగిపోయింది. మారడోనా భౌతికకాయంపై
జాతీయ జెండాతో పాటు అతడి 10వ నంబర్ జెర్సీని కప్పి ఆ దేశ అధ్యక్ష భవనంలో
సందర్శనకు ఉంచారు. అయితే తమ ఫుట్బాల్ వీరుడు డిగోను కడసారి చూసేందుకు వేలాది
మంది అభిమానులు గురువారం తెల్లవారుజాము నుంచే అక్కడికి తరలివచ్చారు.
మారడోనా ఫొటోలు, 10వ
నంబర్ జెర్సీ పట్టుకొని వందలాది మంది రహదారులపైనే కన్నీరు మున్నీరయ్యారు. భారీ
సంఖ్యలో వచ్చిన ప్రజలను పోలీసులు
అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మారడోనా మృతితో అర్జెంటీనా
ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించి, జాతీయ జెండా
అవనతం చేసింది. కాగా మారడోనా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా
క్రీడా, రాజకీయ, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియ చేశారు.
మరోవైపు కేరళ ప్రభుత్వం సైతం క్రీడారంగానికి రెండు రోజులు సంతాప దినాలుగా
ప్రకటించింది.
డిగో మారడోనా ఫుట్బాల్
మాంత్రికుడు. కెరీర్ మొత్తం ప్రపంచమంతా ఆయనను ఇష్టపడింది. ఫుట్బాల్ మైదానంలో ఎన్నో అత్యుత్తమ
సందర్భాలను ఆయన మనకు ఇచ్చారు. ఆయన మృతి మనందరిని ఎంతో బాధిస్తున్నది. మారడోనా
ఆత్మకు శాంతి చేకూరాలి అని పలువురు అంటున్నారు.
‘అర్జెంటీనాతో పాటు ఫుట్బాల్కు అత్యంత విషాదకరమైన
రోజు ఇది. ఆయన వైదొలిగాడు.. కానీ మనల్ని వదిలి వెళ్లలేదు. ఎందుకంటే డిగో
ఆద్యంతరహితుడు’ అని మెస్సీ, అర్జెంటీనా స్టార్ పేర్కొన్నారు.