డిగో మారడోనా అంత్యక్రియలకు వేలాది మంది అభిమానులు
By: chandrasekar Sat, 28 Nov 2020 3:13 PM
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం
డిగో మారడోనా అంత్యక్రియలకు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఫుట్బాల్
మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా అంత్యక్రియలు
పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానుల బాధాతప్త హృదయాలు అశ్రు నిరాజనాలతో ఆరాధ్య
ఆటగాడు డిగోకు శుక్రవారం తుది వీడ్కోలు పలికారు. డిగోకు మరణం లేదు మా మనసుల్లో
చిరస్థాయిగా ఉంటాడు అంటూ ప్రజలు దిక్కులు
పిక్కటిల్లేలా నినదించారు. సంద్రాన్ని తలపించేలా రహదారులపై ఉన్న జనం మధ్య
అర్జెంటీనా జాతీయ జెండా, 10 నంబర్ జెర్సీ కప్పి ఉంచిన శవపేటికలో మారడోనా
అంతిమయాత్ర జరిగింది.
గొప్ప వీరుడు మారడోనా
భౌతికకాయం అనంతరం జర్డిన్ బెల్లావిస్టా శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో
అంత్యక్రియలు జరిగాయి. తల్లిదండ్రుల సమాధుల దగ్గరే డిగో పుడమి ఒడికి చేరాడు.
అంత్యక్రియల కార్యక్రమానికి 24 మంది మాత్రమే హాజరు కాగా శ్మశాన వాటిక బయట వేలాది
మంది ప్రజలు మారడోనాకు జేజేలు పలికారు. 1986 ప్రపంచకప్ గెలిచినప్పుడు సంబురాలు చేసుకున్న ప్లాజా
డె మయో వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఒక్క చోట చేరి సాకర్ గీతాలు పాడితే మరికొందరు
జాతీయ పతాకాన్ని రెపరెపలాడించి అర్జెంటీనా ముద్దుబిడ్డకు వీడ్కోలు పలికారు.
అక్కడ అంతకుముందు అధ్యక్ష
కార్యాలయంలో మారడోనా భౌతికకాయం సందర్శనను ఆపిన సమయంలో ఎంతో సేపటి నుంచి
వేచిచూస్తున్న అభిమానులు అసహనానికి గురయ్యారు. ఎలాగైనా తమ సాకర్ హీరోను కడసారి
చూడాలన్న ఆకాంక్షతో చొచ్చుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
పరిస్థితి అప్పటికీ అదుపులోకి రాకపోవడంతో రబ్బర్ బుల్లెట్లను సంధించారు.
అభిమానులు చాలా ఆవేదనతో మారడోనాకి తుది వీడ్కోలు పలికారు.