పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి టోకెన్ల కోసం బారులు తీరిన రైతుల దీన పరిస్థితి....
By: chandrasekar Fri, 13 Nov 2020 4:39 PM
పండించిన ధాన్యాన్ని
అమ్ముకోవడానికి టోకెన్లు తీసుకోవడం కోసం
రైతులు బారులు తీరారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల వ్యవసాయ కార్యాలయం
ముందు శుక్రవారం తెల్లవారుజాము నుంచే వందలాది రైతులు టోకెన్ల కోసం ఇలా క్యూ లైన్
కట్టారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలు వరిధాన్యం సాగు రైతుల కొంప ముంచింది.
ఒకవైపు దిగుబడి తగ్గి, మరోవైపు మద్దతు ధర లభించక రైతులు నానా అవస్థలు
పడుతున్నారు. ప్రస్తుతం టోకెన్ విధానం అమలు చేస్తుండడంతో వరి కోయడానికి కూడా
టోకెన్ల తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో టోకెన్ల కోసం రోజూ రైతులు
తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద బారులుదీరుతున్నారు.
సన్నరకం ధాన్యం
విక్రయించుకోవడానికి అధికారులు జారీ చేస్తున్న టోకెన్ల కోసం రైతులు ఆయా మండల
కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. టోకెన్ తీసుకున్న తర్వాతనే వరి
కోసి మిల్లుకు ధాన్యం తీసుకురావాలని నిబంధనలు ఉన్నందున రైతులు తహసీల్దార్
కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 10వ తేదీన 11, 12, 13వ తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేయడంతో గురువారం టోకెన్లు జారీ చేయడం
లేదని మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం వద్ద అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు.
అయినా రైతులు కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.