దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదు ..లవ్ అగర్వాల్
By: Sankar Thu, 11 June 2020 9:27 PM
దేశం మొత్తం కరోనాతో వణికిపోతున్న వేళ ఐసీఎంఆర్ చల్లటి కబురు ప్రకటించింది. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి ఎంత మాత్రమూ లేదని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ స్పష్టం చేశారు. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి జరగలేదని ఆయన ప్రకటించారు. మరణాల రేటు కూడా స్వల్పంగానే ఉందని, ఆస్పత్రుల్లో పడకల కొరత ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. లాక్డౌన్ కారణంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగామని ప్రకటించారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా బారిన పడ్డ ప్రజల సంఖ్య మన దేశంలో తక్కువగానే ఉందని వెల్లడించారు.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని ఆయన ప్రకటించారు. మన దేశంలో మరణాల రేటు కేవలం 2.8 శాతమే ఉందని, ఇది ప్రపంచంతో పోలిస్తే అత్యల్పమని అన్నారు. అయితే వైరస్ అనుమానితుల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, వారిని గుర్తించేందుకు పరీక్షల సంఖ్యను పెంచామని భార్గవ తెలిపారు. రికవరి రేటు 49.1 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.