జీజీహెచ్లో చోరీ
By: chandrasekar Tue, 22 Sept 2020 5:34 PM
కరోనా పేషెంట్ల కోసం
తీసుకువచ్చిన కాస్ట్లీ ఇంజక్షన్లను అక్కడ పనిచేసే సిబ్బంది మాయం చేశారు. దీంతో
గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రి (జీజీహెచ్)లో ఔషధాలకూ భద్రత లేదని రోగులు, స్థానికులు
ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి మెడికల్ స్టోర్ విభాగానికి వార్డుబాయ్ ఒకరు ఆదివారం
వెళ్లి అక్కడ పని చేసే ఉద్యోగుల కళ్లుగప్పి ఖరీదైన ఇంజెక్షన్లతో కూడిన బాక్సును
పట్టుకుపోయాడు. ఆ ఇంజక్షన్లను ఓ మెడికల్ స్టోర్లో అమ్మేశాడు. ఈ ఘటన ఆసుపత్రి
ఉన్నతాధికారులకు షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో మెడికల్ స్టోర్ విభాగం అత్యంత
కీలకమైనది. ఖరీదైన మందులను స్ట్రెచర్లు, చక్రాల కుర్చీల్లో పెట్టుకుని ఇక్కడ నుంచి వార్డుబాయ్లు, స్టాఫ్
నర్సులు తీసుకెళ్తారు. అయితే ఈ స్టోర్లో సీసీ కెమెరాలను ఎక్కడా ఏర్పాటు చేయలేదు.
మెడికల్ స్టోర్స్ నుంచి
వార్డు బాయ్ ఇంజెక్షన్ల బాక్సును బయటకు తీసువెళ్లే వరకు అటు భద్రతా సిబ్బంది, ఇటు
మెడికల్ స్టోర్ సిబ్బందికి తెలియకపోవడం గమనార్హం. ఒక్కో ఇంజెక్షన్ ధర బయట మార్కెట్లో రూ.5వేలకు
పైగా ఉంటుంది. ఇంత ఖరీదైన మందుల నిల్వలను స్టోర్ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఆరుబయటే
పెట్టి ఉంచడం గమనార్హం. దీనిపై జీజీహెచ్ పర్యవేక్షకురాలు ఆచార్య ప్రభావతమ్మ
స్పందించారు. చోరీకి పాల్పడిన వార్డు బాయ్ను సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటన ఎలా
జరిగిందో నివేదిక ఇవ్వాలని విచారణకు ఆదేశించమని తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులకు
ఫిర్యాదు చేస్తామన్నారు.