పాము కాటేయడంతో మృతి చెందిన అన్న ప్రాణాపాయ స్థితిలో తమ్ముడు
By: chandrasekar Sat, 05 Sept 2020 10:09 AM
పాము కాటుకు గురైన అన్నదమ్ములలో అన్న మృతి చెందగా తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. అన్నదమ్ములను ఓ విషపూరిత పాము కాటేసింది. ఈ దుర్ఘటనలో అన్న మృతిచెందగా తమ్ముడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని దౌలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నేలపై పడుకున్న వీరిని పాము కాటేసింది.
పాము కారులో మృతి చెందిన రాంచరణ్(10) స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంచరణ్ తన తమ్ముడు నరసింహులు(7), సోదరి శృతి, తండ్రి నారాయణ, తల్లి కేశమ్మతో కలిసి ఇంట్లో నేలపై పడుకున్నారు. నిద్ర నుంచి లేవడంతోనే రాంచరణ్ కడుపునొప్పిగా ఉందని పేర్కొన్నాడు. దుప్పటిని దులిపి చూడగా అందులో విషపూరిత పాము కనిపించింది. నర్సింహులు సైతం నొప్పిగా ఉందని పేర్కొన్నాడు.
తీవ్రత గుర్తించలేని తల్లిదండ్రులు ఇద్దరిని సమీప గ్రామం రామతీర్థంలోని నాటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో చిన్నారులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు అన్నదమ్ములను ఇద్దరినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమాద్యలోనే రాంచరణ్ చనిపోయాడు. నరసింహులు ప్రాణాలతో పోరాడుతున్నాడు. జరిగిన ఘటనపై పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు.