ఇరుదేశాలు సరిహద్దు వివాదాలతో కయ్యానికి కాలుదువ్వుకోవద్దని హితవు: దలైలామా
By: chandrasekar Sat, 11 July 2020 10:38 AM
గల్వాన్ లోయలో భారత్-చైనా
సైన్యాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయి చర్చలతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో టిబెట్ మత గురువు దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాలు సరిహద్దు
వివాదాలతో కయ్యానికి కాలుదువ్వుకోవద్దని హితవు పలికారు.
రెండు దేశాలూ శక్తిమంతమైన
దేశాలని, పక్క
దేశాన్ని దెబ్బతీయాలని ఏ దేశం అనుకున్నా రెండు దేశాలు నష్టపోతాయని పేర్కొన్నారు.
పక్కపక్కనే ఉన్న రెండు దేశాలు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. 'భారత్-చైనా
దేశాలు ప్రపంచంలోనే పురాతనమైన చారిత్రక మూలాలు కలిగిన దేశాలు. అంతేగాక100
కోట్లకు పైగా జనాభా కలిగిన దేశాలు. ఇలాంటి దేశాల మధ్య ఇటీవలి కాలంలో అనేక
విషయాల్లో పోటీ తత్వం మొదలైంది.
అయితే ఇరు దేశాలు
శాంతియుతంగా, ఆరోగ్యకరమైన పోటీ విధానాన్నే అవలంబించాలి. ముఖ్యంగా ఓ
విషయాన్ని గుర్తుంచుకోవాలి. చైనా చరిత్రలో శాంతికి చిహ్నమైన బౌద్ధానికి ఎంతో
ప్రాధాన్యం ఉంది. అలాంటి బౌద్ధానికి ఆది గురువైన బుద్ధుని జన్మస్థలం భారతదేశం.
అందుకే ఈ రెండు దేశాలు
శాంతికి మారుపేరుగా ఉంటూ పరస్పర సహకారంతో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి' అని
దలైలామా సూచనచేశారు. ఇదిలా ఉంటే టిబెటన్ ఉద్యమం, ప్రభుత్వ పరిపాలనా
విషయాలపై 2011 నుంచి దలైలామా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇన్ని
రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు భారత్-చైనా విషయంలో ఆయన స్పందించారు.