నూతన సచివాలయ నిర్మాణానికి రెండే రెండు సంస్థలు బిడ్లు దాఖలు...?
By: chandrasekar Thu, 22 Oct 2020 2:59 PM
తెలంగాణ రాష్ట్రంలో నూతన
సచివాలయం నిర్మాణ ప్రక్రియలో కీలకమైన టెండర్ల దాఖలు పూర్తయింది. రెండే రెండు
సంస్థలు బిడ్లు దాఖలు చేయడం విశేషం. వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న ఇప్పటి తెలంగాణ , మొన్నటి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ స్థానంలో నూతన అధునాతన సచివాలయం నిర్మించడానికి
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు అడ్డంకుల్ని అధగమించి పాత సచివాలయాన్ని
పడగొట్టే పని పూర్తి చేసింది. ఇప్పుడా స్థానంలో నూతన సచివాలయం నిర్మాణ పనులు
ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఇందులో
భాగంగా ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఆశ్చర్యమేమంటే నూతన సచివాలయ నిర్మాణానికి
కేవలం రెండే రెండు టెండర్లు దాఖలయ్యాయి.
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం కోసం నిర్మాణ రంగంలో ప్రముఖ సంస్థలుగా ఉన్న
ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలు మాత్రమే టెండర్లలో పాల్గొన్నాయి.
నిన్నటితో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. గడువు పూర్తయిన అనంతరం 2
టెండర్లు మాత్రమే దాఖలయ్యాయని రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రకటించారు. ఈ టెండర్ల సాంకేతిక
అర్హతలను పరిశీలించి 23 వ తేదీన ఫైనాన్షియల్ టెండర్లు తెరవనున్నారు. రెండు
సంస్థల సాంకేతిక అర్హతల్లో ఎంపికైన సంస్థకు సంబంధించిన ఫైనాన్షియల్ టెండర్ ను
మాత్రమే తెరుస్తారు. రెండూ అర్హత సాధిస్తే తక్కువ కోట్ చేసిన సంస్థకు కొత్త
సచివాలయ నిర్మాణ బాధ్యత అప్పగిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం నిర్మాణం దసరా రోజున ప్రారంభించాలని నిర్ణయించింది. యేడాదిలోగా
పనులు పూర్తి చేసి వచ్చే సంవత్సరం దసరా రోజున కొత్త భవనాన్ని ప్రారంభించాలని
లక్ష్యంగా పెట్టుకుంది. అయితే టెండర్లకు సంబంధించిన కసరత్తులో జాప్యం జరగటంతో
దసరాకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించట్లేదు. ఈ నెల 23
వతేదీన ఫైనాన్షియల్ బిడ్లు తెరిచిన తర్వాత.. ఎంపిక చేసిన సంస్థతో ఒప్పందం
చేసుకోవల్సి ఉంటుంది. బ్యాంకు గ్యారంటీని సమర్పించాలి. లేబర్ క్యాంపు ఏర్పాటు
చేసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియకు ఎంతలేదన్నా15 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో దసరాకు
పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కన్పించడం లేదు.
వాస్తవానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావల్సి ఉన్నా, రెండుసార్లు
గడువు పెంచాల్సి వచ్చింది. తొలుత స్థానికంగా రిజిస్టర్ అయిన సంస్థలే దాఖలు
చేయాలన్న నిబంధనతో టెండర్లు ఆహ్వానించారు. అనంతరం ఆ నిబంధనను సడలించారు. దాంతో
టెండర్ల తేదీ మారింది. ఆ తరువాత వివిధ కారణాలతో మరోసారి గడువు పెంచాల్సి వచ్చింది.
మరోవైపు ఈ ప్రక్రియపై ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం కూడా ఉంది. ప్రస్తుతం
సచివాలయ ప్రాంగణంలో ఎక్కడ తవ్వినా పెద్దమొత్తంలో నీరు ఊరే అవకాశం ఉందని అధికారులు
హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పనులు ప్రారంబించడం సాధ్యం కాదని...వర్షాల
ఉధృతి పూర్తిగా తగ్గిన తరువాతే పనులు ప్రారంభించాలనేది అధికార్ల ఆలోచన. ఇటీవల నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి 5 పెద్ద
కంపెనీలు హాజరయ్యాయి. ఇందులో తెలంగాణకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ టెండర్
దరఖాస్తు దాఖలు చేసేందుకు మాత్రం మూడు సంస్థలు వెనుకంజ వేశాయి. ఒక సంస్థకు అర్హత
లేదని తేలింది. మరో సంస్థ అితే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్మాణ గడువు
మార్చాలని విజ్ఞప్తులు చేసింది. దాంతో అధికారులు మొత్రం ప్రక్రియను రద్దు చేశారు.