టీడీపీ ఎస్సీ వర్గీకరణ అంశం మళ్ళీ తెరమీదికి
By: chandrasekar Mon, 02 Nov 2020 09:44 AM
టీడీపీ అధికారంలో
వున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం మళ్ళీ తెరమీదికి రానుంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం మరోసారి
తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో ఎస్సీ
వర్గీకరణ చేసిన తెలుగు దేశం పార్టీలో మరోసారి ఈ అంశం తెరమీదికి వచ్చింది. ఎస్సీ
వర్గీకరణ చేయాలని మాదిగ సామాజికవర్గం నాయకులు బలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఈ తరుణంలో టీడీపీలోని మాదిగ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఆదివారం విజయవాడలో
రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ ముఖ్య నాయకులు వర్ల రామయ్య, జవహర్, ఎంఎస్
రాజు సహా ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై టీడీపీ మాదిగ నేతలు
సుదీర్ఘంగా చర్చించారు. వర్గీకరణ కోసం టీడీపీ అధినేత, ప్రతిపక్ష
నాయకుడు చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే
అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై తీర్మానం చేయాలని నేతలు కోరనున్నారు. ఎస్సీ
వర్గీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. 2014
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలు కీలక అంశాలపై టీడీపీ
డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీ డిక్లరేషన్, ఎస్సీ
వర్గీకరణ, తెలంగాణ
తదితర అంశాలపై టీడీపీ తన వైఖరిని ప్రకటించింది.
అప్పుడు టీడీపీ
అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఏపీలో చంద్రబాబు వర్గీకరణ అంశాన్ని పక్కన పడేశారు.
అంతే కాకుండా 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా, టీడీపీ
అనుకూలంగా వ్యవహరించిన మంద కృష్ణమాదిగను అధికారంలోకి వచ్చాక ఘోరంగా అవమానించారు.
ఏపీలో మాల కులస్తుల జనాభా ఎక్కువగా ఉండటంతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ
మాలలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో చంద్రబాబుకు మాదిగ సామాజిక వర్గం దూరం
జరిగింది. ఈ తరుణంలోనే 2019లో ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఊహించినట్లుగానే
మాదిగలు టీడీపీ వ్యతిరేకంగా ఓటెయ్యగా, అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చిన మాలలు సైతం
చంద్రబాబుకు ఊహించని విధంగా షాకిచ్చారు. దీంతో ఎస్సీ ఓట్లన్నీ వైసీపీకి పడిపోయాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో పార్టీని
బలోపేతం చేసేందుకు టీడీపీ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే చాలా
కాలంగా టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న మాదిగలను మళ్లీ దగ్గరయ్యేందుకు చంద్రబాబు
భావిస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ప్రయత్నాలకు మాదిగ సామాజిక వర్గం ఎలా
రియాక్ట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. అలాగే టీడీపీలోని మాల నాయకులు ఏ విధంగా
స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. చాలా కాలం తర్వాత ఏపీలో మళ్లీ ఎస్సీ వర్గీకరణపై
టీడీపీ నాయకుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.