మరో భారీ నోటిఫికేషన్కు రంగం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం...
By: chandrasekar Tue, 10 Nov 2020 8:41 PM
రాష్ట్ర ప్రభుత్వం అటవీ
శాఖలో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి
త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు రాష్ట్ర అటవీ శాఖ అధికారి ప్రతీప్ కుమార్
వివరాలు ప్రకటించారు. మంగళవారం ప్రతీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 23 శాతం
అటవీ విస్తీర్ణం ఉందని తెలిపారు. జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్రంలో మరో 10 శాతం
అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం అటవీ
శాఖలో 40 శాతం
సిబ్బంది కొరత ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా
త్వరలోనే 540 క్షేత్రస్థాయి పోస్టులు భర్తీ కానున్నాయని ప్రతీప్
కుమార్ తెలియజేసారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల భర్తీ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని
తెలిపారు. అలాగే మరో 800 నుంచి 1,000 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా దశలవారీగా భర్తీ
చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టణీకరణ వల్ల
జంతువులు అడవుల్లో నుంచి జనాల్లోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు
జిల్లాలో ఏనుగుల సంచారం కనిపిస్తోందని.. ఇది సున్నితమైన సమస్య కావడం వల్ల ప్రజలకు
అవగాహన కల్పిస్తున్నామని ప్రతీప్ కుమార్ అన్నారు.