తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి ఆరా
By: chandrasekar Thu, 15 Oct 2020 6:40 PM
తెలుగు రాష్ట్రాలు భారీ
వర్షాలు వరద పరిస్థితుల కారణంగా వణికిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితి ఘోరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో
నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఇరు రాష్ట్రాల
ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. మూడు రోజుల నుంచి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాల్ని వణికించేస్తున్నాయి.లోతట్టు ప్రాంతాల జలమయమై ప్రజా జీవనం
స్థంబించుకోపోయింది. ప్రకాశం బ్యారేజ్ కు భారీగా తరలివస్తున్న వరద ఉధృతితో కృష్ణా, గుంటూరు
జిల్లాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు
తరలించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఇప్పటికే సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అటు తెలంగాణలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా
మారింది. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ వరద ముప్పులో చిక్కుకుపోయింది. చాలా
ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కాలువలు, వంకలు, నదులు పొంగి పొర్లుతూ పక్కనున్న ప్రాంతాల్ని
ముంచెత్తుతున్నాయి. కేవలం ఒక్కరోజులో హైదరాబాద్ నగరంలో 32
సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ఇళ్లు కూలిపోయాయి. కార్లు, బైకులు
వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఇప్పటికే 15 మంది వరకూ చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అడిగి
తెలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లకు ఫోన్ చేసి వర్షాలు, అనంతర
పరిస్థితులను తెలుసుకున్నారు. వాయుగుండం తీరం దాటిందని, సాధారణ
పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రధాని మోదీకి జగన్ వివరించారు. అటు హైదరాబాద్
పరిస్థితిని కేసీఆర్ మోదీకు వివరించారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు
చేపట్టాల్సిందిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని మోదీ హామీ
ఇచ్చారు.