మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి మిడతల ప్రవేశానికి అవకాశం
By: chandrasekar Wed, 27 May 2020 6:01 PM
ప్రస్తుతానికి ఈ మిడతల
దండు రాష్ట్ర సరిహద్దుకు 400
కిలోమీటర్ల దూరంలో ఉందని తెలంగాణ అధికారులు తెలిపారు. ఇవి రాష్ట్రంలోకి
ప్రవేశించేది లేనిది మరో రెండు రోజుల్లో తెలుస్తుందన్నారు. పాకిస్థాన్ నుంచి భారత్లోకి
ప్రవేశించిన రాకాసి మిడతల దండు మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి అడుగు పెట్టే అవకాశం
ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ రాకాసి మిడతలు ఇప్పటికే
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పంటకు నష్టం కలిగించాయి.
గతంలో ఎన్నడూ లేని రీతిలో.. మిడతల దండు తెలంగాణ వైపు వస్తోంది. మహారాష్ట్ర మీదుగా
తెలుగు నేలవైపు లక్షలాది మిడతలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మిడతలు తమ
శరీర బరువుకు మించి ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి వెళ్లిన చోట పచ్చదనం మాయం
అవుతుంది. పంటలకు తీవ్రం నష్టం వాటిల్లుతుంది. 35 వేల మందికి సరిపడే ఆహారాన్ని ఇవి ఒక్క రోజులో
తినేస్తాయి. దీంతో ఈ మిడతలు తెలంగాణలో అడుగుపెడితే పరిస్థితి ఏంటని మహరాష్ట్ర
సరిహద్దు జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి
జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిడతలను పారదోలేందుకు
అవసరమైన రసాయనాలను సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి
అధికారులను ఆదేశించారు. గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి రైతులకు మిడతల గురించి అవగాహన
కల్పించాలని సూచించారు. జూన్ నెల నాటికి ఈ మిడతల సంతతి నాలుగు రెట్లు పెరిగే
ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇవి గంటకు 1.5 కిలోమీటర్
వరకు ప్రయాణిస్తూ.. ఆ ప్రాంతంలోని పంటను నాశనం చేస్తాయి.