రానున్న 12రోజుల్లో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం
By: chandrasekar Wed, 10 June 2020 11:19 AM
ఢిల్లీలో ఇప్పటి వరకు
కరోనా సామాజిక వ్యాప్తి లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఆ రాష్ట్ర డిప్యూటీ
సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడుగా ఉన్న
లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో
ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్, కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో కరోనా
పరిస్థితి పరిశీలించారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తే రానున్న 12రోజుల్లో
ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
కరోనా బాధితులకు చికిత్స
అందించేందుకు ఈనెలాఖరులోగా 15వేల పడకలను అందుబాటులో ఉంచాలని, జూలై
వరకు 80వేల
పడకలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. జూలై 31వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 5.5లక్షలకు
చేరే అవకాశముందని పేర్కొన్నారు. ఢిల్లీలో
కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్
గులేరియా అంగీకరించారని, కేంద్ర ప్రభుత్వం దీన్ని ధ్రువీకరించాల్సి ఉందని
ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు.