పవర్ టిల్లర్ను కలుపు యంత్రంగా మార్చిన మెకానిక్
By: chandrasekar Fri, 14 Aug 2020 11:45 AM
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి
పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ చాలా అవసరమౌతోంది. పొలాల్ల కలుపు తీయడం ఇప్పటికీ
శారీరక శ్రమపై ఆధారపడాల్సి వస్తున్నది. మరీ ముఖ్యంగా పత్తి చేనుల్లో కలుపు తీయడం
చాలా కష్టమైన పని. దీనికి తోడు కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో కలుపు తీయకపోవడం
వల్ల పంట ఉత్పత్తి తగ్గిపోతోంది.
ఇలాంటి సమస్య నుండి బయట
పడటానికి రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ మెకానిక్
పవర్ టిల్లర్ను కలుపు యంత్రంగా మార్చి రైతులకు అండగా నిలుస్తున్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్కు చెందిన రాగి కిషన్ గొల్లపల్లిలో మోటర్ మెకానిక్గా గత 35
ఏండ్లుగా పనిచేస్తున్నాడు. మోటర్ సైకిళ్లు, జీపులు, వ్యాన్లు, మినీ బససులు, మిల్లర్లు, జేసీబీలు, హార్వెస్టర్లను బాగుచేయడంతో కిషన్ది అందెవేసిన
చెయ్యి.
పత్తి చేలల్లో కలుపు
తీయడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన కిషన్ వారికోసం కలుపు యంత్రం తయారుచేయడానికి
సిద్ధమయ్యాడు. రూ.45,000 ఖర్చుతో నెల రోజుల వ్యవధిలోనే కలుపు తీసే పవర్
టిల్లర్ను రూపొందించాడు. కలుపు తీసే పవర్ టెల్లర్ యంత్రం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల
మంత్రి కే తారక రామారావు దృష్టిని ఆకర్షించింది.
సిరిసిల్ల జిల్లాలోని
ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన గ్రామీణ మెకానిక్ కలుపుతీసే పవర్ టిల్లర్
తయారుచేశారని ట్విట్టర్ వేదిక ద్వారా మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ వినూత్న
ఆవిష్కరణను వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వద్ద ప్రదర్శించాలని మంత్రి సూచించారు.
రెండు అడుగుల వెడల్పు, ఆరు
అడుగుల పొడవు గల పవర్ టిల్లర్ పత్తి
మొక్కల వరుసల మధ్య సులభంగా కదులుతుందని, రెండు గంటల్లో ఎకరంలో కలుపు మొక్కలను తొలగించవచ్చని
రాగి కిషన్ చెప్పారు. పురుగుమందులను పిచికారీ చేయడానికి రోటావేటర్తో పాటు
స్ప్రింక్లర్లను ఫిక్సింగ్ చేయడం ద్వారా పవర్ టిల్లర్ను అప్గ్రేడ్ చేయాలని కిషన్
ఆలోచిస్తున్నారు.