చచ్చాడని పాతిబెట్టిన వ్యక్తి తిరిగి లేసొచ్చాడు...
By: chandrasekar Sat, 08 Aug 2020 7:18 PM
చచ్చాడని పాతిబెట్టిన
వ్యక్తి తిరిగి లేసొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పరిధిలోని కల్నల్ గంజ్లో
చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లో గొడవపడి వెళ్లిపోయాడు. అతడి కోసం గాలించిన కుటుంబ
సభ్యులు కోపం తగ్గాక తిరిగి వస్తాడులే అని అనుకున్నారు. ఎందుకంటే అతడు తరచు భార్యతో గొడవపడేవాడు. అయితే, అతడు ఇంటికి రాకపోగా ఓ చేదు వార్త చెవిలో పడింది.
అతడు చనిపోయాడని, శవాన్ని
తీసుకుని వెళ్లండి అని పోలీసులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆ శవాన్ని
తీసుకొని అంత్యక్రియలు జరిపారు. స్మశానంలో పూడ్చిపెట్టారు. అంతా బాధలో ఉన్న సమయంలో
అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని అలా చూడగానే ఇంట్లోవారంతా ఉలిక్కిపడ్డారు.
అదేంటీ తమ చేతులతోనే కదా అతడిని ఖననం చేశాం మళ్లీ ఎలా తిరిగొచ్చాడని అంతా జుట్టు
పీక్కున్నారు.
వివరాల్లోకి వెళ్ళినట్లైతే
ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పరిధిలోని కల్నల్ గంజ్లో
చోటుచేసుకుంది. చమన్గంజ్లో నివసిస్తున్న 39 ఏళ్ల
అహ్మద్ హసన్కు భార్య, ఇద్దరు
పిల్లలు ఉన్నారు. అహ్మద్ ఎప్పుడూ భార్యతో గొడవపడేవాడు. పదే పదే ఇంటి నుంచి బయటకు
వెళ్లిపోయి రెండు మూడు రోజుల తర్వాత తిరిగివచ్చేవాడు. ఆగస్టు 2న కూడా ఇదే విధంగా భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు.
అయితే, ఎంతకీ ఇంటికి తిరిగిరాలేదని అతని భార్య పోలీసులకు
ఫిర్యాదు చేసింది. ఆగస్టు 5న
పోలీసుల నుంచి కబురు వచ్చింది. తమకు ఓ శవం దొరికిందని, అది అహ్మద్ అని అనుమానంగా ఉందని చెప్పారు.
పోలీసుల దగ్గరకెళ్ళిన
కుటుంబ సభ్యులు ఆ శవాన్ని చూసి అది అహ్మద్దేనని చెప్పారు. దీంతో పోలీసులు ఆ
శవాన్ని అప్పగించారు. ఆ శవాన్ని ఖననం చేసిన తర్వాత అంతా ఇంటికి వెళ్లిపోయారు.
శుక్రవారం, ఆగస్టు
7న అహ్మద్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతడిని చూడగానే
కుటుంబ సభ్యులకు ఓ వైపు ఆశ్చర్యం మరోవైపు సంతోషం చివరికి అనుమానం కలిగింది. ఇతడు
అహ్మద్ అయితే మొన్న పాతిపెట్టిన శవం ఎవరిదంటూ మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. అయితే, అది గుర్తుతెలియని వ్యక్తి శవమని పోలీసులు
తెలుసుకున్నారు. పాతిపెట్టిన శవాన్ని వెలికి తీసి డీఎన్ఏ పరీక్షలు చేస్తామని
తెలిపారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.