ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్లకు పొంచి ఉన్న సరికొత్త ప్రమాదం
By: chandrasekar Fri, 04 Sept 2020 10:10 AM
ఫోన్ ఛార్జింగ్ వేగంగా అవ్వడం కోసం ఇటీవలి కాలంలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అన్ని ఫోన్లలో వాడుతున్నారు. ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా దీన్ని పిలుస్తూ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్లకు పొంచి ఉన్న సరికొత్త ప్రమాదం వెలుగులోకి వచ్చింది. మీ ఫోన్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అమర్చినప్పుడు, ఛార్జింగ్ చేసే సమయంలో మీరు వాడే ఛార్జర్, మీ ఫోన్ ఎప్పటికప్పుడు దానితో మరొకటి కనెక్ట్ అవుతాయి. ఫోన్ టెంపరేచర్ ఎంత ఉంది, ఫోన్లో ఎంత బ్యాటరీ ఖాళీగా ఉంది, ఎంత ఓల్టేజ్ విద్యుత్ను ఫోన్కు పంపించాలి లాంటి సమాచారం బదిలీ అవుతుంది. ఫోన్ నుంచి వచ్చే ఈ సమాచారాన్ని సేకరించి తగిన విధంగా నడుచుకోవడం కోసం మీరు ప్లగ్కు కనెక్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్లో ఓ మైక్రోప్రాసెసర్, ఫర్మ్వేర్ నిక్షిప్తమై ఉంటాయి. ఫర్మ్వేర్ అంటే అదికూడా ఒక చిన్న సాఫ్ట్వేర్ లాంటిదే.
తాజాగా ఒక సెక్యూరిటీ సంస్థ ఈ ఫర్మ్వేర్ను ఎవరైనా హ్యాక్ చేసేలా దానిలో చాలా లోపాలు ఉన్నట్లు కనుగొంది. ఛార్జర్ను ఫోన్కు కనెక్ట్ చేసినప్పుడు, యూఎస్బీ కేబుల్ ద్వారా ఈ ఫర్మ్వేర్ హ్యాకర్లు మార్పులు చేయడం ద్వారా ఫోన్ తట్టుకోలేనంత భారీ మొత్తంలో విద్యుత్ పంపిస్తుంది. దాంతో ఫోన్ అంతర్గత భాగాలు కాలిపోవడంతో పాటు కొన్ని సందర్భాలలో పైకి ఏమీ కనిపించకపోయినా లోపల సర్క్యూటరీ దెబ్బతిని ఫోన్ పనికిరాకుండా పోతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ లోపం వల్ల ఏ విధమైన సమస్య లేకపోయినా మనం వాడే లేటెస్ట్ టెక్నాలజీలన్నీ బయట పడేంత వరకూ ఎన్ని లోపాలు ఉంటాయి అన్న దానికి ఇది ఒక సాక్ష్యం. ఛార్జర్లో ఉండే ఫర్మ్వేర్ ఫోన్ తయారీ సంస్థలు అప్డేట్ చేస్తాయేమో వేచి చూడాలి.