కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం
By: chandrasekar Tue, 07 July 2020 12:04 PM
కరోనా వైరస్ నియంత్రణ
చర్యల్లో భాగంగా కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి విషయంలో ఆది నుంచి ఓ అడుగు ముందే
ఉంటున్న కేరళ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలను
ఏడాది పాటు తప్పనిసరి చేసింది.
లాక్డౌన్
మార్గదర్శకాల్లో పేర్కొన్న పలు నిబంధనలను ఏడాది పాటు అమలు చేయాలని నిర్ణయించింది.
కరోనా వైరస్ కట్టడి కోసం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక
దూరం పాటించడం, గుమిగూడకపోవడం లాంటి నిబంధనలను ఏడాది పాటు కచ్చితంగా
పాటించాల్సిందేని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ సామూహిక
వ్యాప్తి దశకు చేరుకోనుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు
ఉల్లంఘించిన వారిపై రూ.10 వేల వరకూ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు మహమ్మారుల చట్టానికి సవరణలు చేయనున్నట్లు వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్త
మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు కేరళ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ఈ మేరకు ఒక
నోటిఫికేషన్ జారీ చేసింది.
కేరళ కొత్త మార్గదర్శకాలు
* రోడ్లు, ఫుట్పాత్లపై ఉమ్మి వేయకూడదు.
* బహిరంగ ప్రదేశాల్లో కనీసం 6
అడుగుల దూరాన్ని కచ్చితంగా పాటించాలి.
* ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు తదితరాల వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి
తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లభిస్తే 10 మందికి మించకుండా ఆయా
కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.
* బహిరంగా ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో
తప్పనిసరిగి మాస్కులు ధరించాలి. వాహనాలపై ప్రయాణించేటప్పుడు కూడా మాస్కులు
పెట్టుకోవాలి. ప్రజలు గుమిగూడటానికి ఆస్కారం ఉన్న ఇతర అన్ని ప్రదేశాల్లో మాస్కులు
ధరించాలి.
* దుకాణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాల వద్ద 25
మందికి మించి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* షాపులు, వ్యాపార నిర్వాహకులు కస్టమర్ల కోసం తప్పనిసరిగా
శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
* పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 50
మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి, భౌతిక
దూరం పాటించాలి. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
* అంత్యక్రియలకు 20 కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు.
ఈ నిబంధనలు ఏడాది పాటు
లేదా కొత్తగా ఉత్తర్వులు జారీ చేసేంత వరకు అమల్లో ఉంటాయని కేరళ ప్రభుత్వం
ప్రకటించింది.