మరోసారి పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేసిన కర్ణాటక ప్రభుత్వం
By: chandrasekar Tue, 24 Nov 2020 10:43 AM
కరోనా తీవ్రత ఏమాత్రం
తగ్గకుండా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యేలా వుంది. ఇందువల్ల కర్ణాటకలో పాఠశాలలను పునఃప్రారంభించాలన్న
నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. సోమవారం ఆ రాష్ట్ర
ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, విద్యాశాఖ మంత్రి సురేశ్కుమార్ విద్యాశాఖ
ఉన్నతాధికారులు, కొవిడ్ సాంకేతిక సలహా కమిటీతో సమావేశం నిర్వహించారు.
సమావేశం అనంతరం సీఎం
యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలను
ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు తెలిపారు.
డిసెంబర్ చివరివారం తరువాత నిపుణుల కమిటీతో మరోసారి సమావేశమై తగిన నిర్ణయం
తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి ఎన్ఎస్ఎల్సీ (సీనియర్ స్కూల్ లివింగ్
సర్టిఫికెట్), పీయూసీ (ప్రీ యూనివర్సిటీ ఎగ్జామ్స్) తరగతులను
ప్రారంభించడం లేదని పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన సమావేశంలో
సాంకేతిక సలహా కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ఎంకే సుదర్శన్ ప్రభుత్వం త్వరలో
పాఠశాలలను ప్రారంభించే యోచనలో ఉందని సభ్యులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో గత నెల 17న కళాశాలలను తెరిచినా విద్యార్థుల హాజరుశాతం చాలా
తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.