- హోమ్›
- వార్తలు›
- ఇండిపెండెన్స్ డే స్పెషల్ : స్వాతంత్య్ర పోరాట గతిని సమూలంగా మార్చేసిన 1857 సిపాయిల తిరుగుబాటు
ఇండిపెండెన్స్ డే స్పెషల్ : స్వాతంత్య్ర పోరాట గతిని సమూలంగా మార్చేసిన 1857 సిపాయిల తిరుగుబాటు
By: Sankar Fri, 14 Aug 2020 07:02 AM
భారత దేశం ఇప్పుడంటే సొంతంగా నాయకులను నియమించుకొని పరిపాలన చేసుకుంటుంది కానీ ఒక డెబ్భై అయిదు ఏళ్ళు వెనక్కి వెళ్తే బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో చిక్కుకొని స్వాతంత్య్రం కోసం అనేక పోరాటాలు చేసింది..అయితే భారత ఫ్రీడమ్ ఫైట్ లో అనేక గొప్ప గొప్ప పోరాటాలు ఉన్నాయి అయితే భారతీయులలో మొదటిసారి స్వాతంత్ర కాంక్షను రగిలించింది మాత్రం 1857 సిపాయిల తిరుగుబాటు ..
అప్పటి వరకు బ్రిటీష్ పాలకుల అజమాయిషీని భరిస్తూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యమానికి ఈ తిరుగుబాటు ఊపిరిపోసింది. సామాజిక వివక్ష, లెక్కలేనన్ని అవమానాలు, అంగీకరించలేని స్థాయిలో అసమానతలను సైతం పంటిబిగువన భరిస్తూ వచ్చిన భారతీయ సిపాయిలు.. చివరికి తమ మనోభావాలను దెబ్బతీసేందుకు బ్రిటీషర్లు ప్రయత్నించడంతో తిరగబడ్డారు. ఈ తిరుగుబాటు భారతదేశ స్వాతంత్య్ర పోరాట గతి.. రీతినే సమూలంగా మార్చేసింది.
ఎన్నేళ్లుగా పనిచేసినా పదోన్నతిపై ఆశలేని ఉద్యోగం.. సహచర బ్రిటీష్ సైన్యంతో పోలిస్తే తీవ్ర పక్షపాతం సిపాయిల్లో తిరుగుబాటు జ్వాల రగిలించింది. 1856లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన జనరల్ బ్రిటీష్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ ప్రకారం సిపాయిలు బ్రిటీష్ పాలనలోని ఏ దేశంలోనైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో కొంతమంది హిందువులు ఈ యాక్ట్పై నిరసన తెలిపారు. ఎందుకంటే.. అప్పట్లో సముద్రంపై ప్రయాణించడాన్ని హిందువులు అపచారంగా భావించారు. కానీ.. ఆంగ్లేయులు ఆ సమయంలో భారతీయుల అభిప్రాయానికి ఇసుమంత విలువ కూడా ఇవ్వలేదు.
సిపాయిల్లో చెలరేగిన ఈ మానసిక ఆందోళన చల్లారకముందే.. మరోసారి బ్రిటీషర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. 1856లోనే రాయల్ కంపెనీ ఎన్ఫీల్డ్ తుపాకుల్ని సైన్యంలోకి ప్రవేశపెట్టింది. వీటిల్లో వినియోగించే తూటాలను సిపాయిలు నోటితో కొరికి అమర్చాల్సి ఉండేది. కానీ.. ఈ కొరకాల్సిన భాగంలో ఆవు, పంది కొవ్వుని పూశారనే వదంతి అంతటా వ్యాపించింది. దీంతో ఆవును పవిత్రంగా భావించే హిందువులతో పాటు.. పందిని అపవిత్రంగా భావించే ముస్లింలు ఈ తుపాకుల వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిబ్రవరి 26, 1857న ప్రయోగాత్మకంగా తుపాకుల్ని పరీక్షించాలని బ్రిటీషర్లు ఆదేశించగా.. బారక్పూర్లోని 19వ దళం సిపాయిలు వ్యతిరేకించారు. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
అనంతరం 1857, మార్చి 29న అదే బారక్పూర్లోని 34వ పటాలానికి చెందిన
మంగళ పాండే తూటాని వినియోగించేది లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో అతనిపై దూషణకి దిగిన సైనికాధికారి లెప్టినెంట్ బాగ్ని మంగళ పాండే కాల్చి చంపేశాడు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద పాండేని ఆంగ్లేయులు ఉరి తీశారు. అనంతరం 19, 34 పటాలాలను రద్దు చేశారు. అయితే.. ఈ తిరుగుబాటు దావానంలా దేశం మొత్తం వ్యాపించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సిపాయిలు ఆ తూటాలను వినియోగించేందుకు నిరాకరించారు. దీంతో వారిని ఉద్యోగాల్లోంచి తీసేసి.. పదేళ్లు జైలు శిక్ష విధించారు.
పాండే తిరుగుబాటు స్ఫూర్తితో.. ఢిల్లీ చేరిన సిపాయిలు భక్తఖాన్ ఆధ్వర్యంలో ఎర్రకోటలో ప్రవేశించి.. బహదూర్ షాని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించి ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. కాన్పూర్లోనూ నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు ప్రారంభమైంది. కానీ.. సరైన దిశా నిర్దేశం లేకపోవడంతో ఈ తిరుగుబాటు నీరు గారిపోయింది. బహదూర్ షాని బ్రిటీషర్లు అదుపులోకి తీసుకుని రంగూన్ జైలుకి తరలించడంతో ఉద్యమం గతి తప్పింది. నానాసాహెబ్ నేపాల్ పారిపోయాడు. బ్రిటీషర్లు అప్పట్లో పైచేయి సాధించినా.. ఈ సిపాయిల తిరుగుబాటు మాత్రం స్వాతంత్య్ర పోరాటంలో చెరగని ముద్ర వేసిన తొలి పోరాటంగా భారతీయుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.