ధరణిలో వివరాల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు
By: chandrasekar Tue, 03 Nov 2020 7:01 PM
ధరణి పోర్టల్లో
వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయవద్దని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని
ఆదేశించింది. వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దనని
సూచించింది. ఇప్పటివరకు సేకరించిన వివరాలను బయటి వ్యక్తులకు ఇవ్వొద్దని
ఆదేశించింది. ఏ చట్టం ప్రకారం ఆధార్, కుల వివరాలు సేకరిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు
ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టం వ్యవసాయ భూములకు సంబంధించింది మాత్రమే
చేయాలని సూచించింది. కొత్త రెవెన్యూ చట్టంలో వ్యవసాయేతర భూముల ప్రస్తావన
ఎక్కడుందని ప్రశ్నించింది. వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని
ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది.
పోర్టల్లో భద్రతాపరమైన
అంశాలపై, దాఖలైన
మూడు పిటిషన్లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్లో
నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.
భద్రతాపరమైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూములు వివరాలు నమోదు చేయడంతో
ఇబ్బందులు తలెత్తుతాయని హైకోర్టు తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్లో ధరణి పోర్టల్ను
పోలిన మరో నాలుగు యాప్స్ ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. దీంతో అసలు ధరణి పోర్టల్
ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని అభిప్రాయపడింది.
సమాచార భద్రతకు సంబంధించి
కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే లేదని, ఆ డేటా దుర్వినియోగమైతే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర
అడ్డంకి కలుగుతుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఏజీ
హైకోర్టుకు తెలిపారు. అడ్వొకేట్
జనరల్ కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరారు. చట్టబద్ధత, డేటా
భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.