తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
By: chandrasekar Mon, 27 July 2020 7:42 PM
తెలంగాణ హైకోర్టు
ప్రభుత్వంపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలను పట్టించుకోకపోవడం
దురదృష్టకరమని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనావైరస్ కేసుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడంలేదని
హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసుల విషయంలో జూన్ 8 నుంచి
అధికారులు ఒక్క ఉత్తర్వును కూడా అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహించింది. తమ
ఆదేశాలు అమలు చేయడం కష్టమైతే ఎందుకో వివరంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం నిన్న విడుదల చేసిన కరోనా బులెటిన్లో కూడా సరైన వివరాలు లేవని
హైకోర్టు తెలిపింది.
కరోనా కేసుల విషయంలో ఏం
చేయమంటారో రేపు సీఎస్నే అడిగి తెలుసుకుంటామని పేర్కొంటూ కరోనాపై దాఖలైన
కేసులన్నింటి విచారణ రేపటికి (జూలై 28)
వాయిదా వేసింది. అయితే కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఎక్కువగా కరోనా
టెస్టులు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించి మందలించింది.
తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందుతున్న తీరుపైనా అసంతృప్తి
వెళ్లగక్కింది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఆదివారం నుంచి కరోనా బులెటిన్లో
మార్పులు కొత్త తరహాలో ఇస్తోంది. అయినా దీనిలో కూడా సరైన వివరాలు లేవని హైకోర్టు
పేర్కొంది. ఇదిలాఉంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే పదే పదే
హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తేలిపింది.