తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టింది
By: chandrasekar Thu, 23 July 2020 11:27 AM
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కరోనా వ్యాప్తితో పాఠశాలలు తెరవడం
కష్టమని, తద్వారా
విద్యార్థులు ఇంటివద్ద చదువుకోవడానికి ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టిందని
అన్నారు. సిద్ధిపేట ఇందిరా నగర్ హైస్కూలులో
విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కరోనా
నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని
పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. ఇంతటి కరోనా విపత్కర
పరిస్థితుల్లో విద్యా శాఖ అధికారులు కష్టపడి పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు
చేపట్టారని ప్రశంసించారు. కరోనా దృష్ట్యా పాఠశాలల ప్రారంభం ఆలస్యం అయినందున పుస్తకాలు
ముందు అందిస్తే విద్యార్థులు ఇళ్లలో చదువుకోవడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి
కేసీఆర్ పంపిణీకి ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థల బలోపేతం కోసం
ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులు బాగా చదివి
మంచి పేరు తీసుకురావాలన్నారు.
విద్యార్థులు కరోనా వైరస్
బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు మంత్రి వివరించారు. ఇందిరా
నగర్ పాఠశాలకు ప్రత్యేకత ఉన్నదని, ఆన్ లైన్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల
భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని మంత్రి అభినందించారు. పాఠశాల
యాజమాన్యం కోరిన విధంగా మంచి వెబ్ కెమెరా, డిజిటల్ స్టూడియో తరగతి గది త్వరలోనే అందిస్తామని
పేర్కొన్నారు.