నాడు హత్యకు గురైన అమ్మాయి నేడు బతికే ఉంది
By: chandrasekar Fri, 18 Sept 2020 6:13 PM
12 ఏళ్ల క్రితం ఓ 14 ఏళ్ల బాలిక
హత్యకు గురైంది. ఆరుగురు వ్యక్తులు ఈ హత్య కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. కానీ అప్పుడు హత్యకు
గురైన అమ్మాయి బతికే ఉంది. పెళ్లి కూడా చేసుకుని హాయిగా బ్రతుకుతోంది. మరి నాడు
లభ్యమైన మృతదేహం ఎవరిది? ఆమె తల్లి కావాలనే ఆ ఆరుగురిపై కక్ష సాధింపు చర్యలకు
పాల్పడిందా? ఇప్పుడు ఈ కేసు పెద్ద మిస్టరీగా తయారయింది.
ఉత్తరప్రదేశ్లోని జలౌన్
జిల్లాలోని కల్పి ప్రాంతానికి చెందిన ఓ 14 ఏళ్ల యువతి 2008లో అదృశ్యమైంది. ఆ అమ్మాయి తల్లి కొత్వాలి పోలీస్
స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కొద్ది రోజుల తర్వాత కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ ఏరియాలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.
దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని అదృశ్యమైన అమ్మాయి తల్లికి చూపించారు. ఆమె తన
కూతురే అని నిర్దారించింది. తన బిడ్డను ఆరుగురు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేసి
హత్య చేశారని ఫిర్యాదులో చెప్పింది. ఈ క్రమంలో ఆ ఆరుగురిని పోలీసులు అరెస్టు
చేసి జైలుకు పంపారు. వీరంతా బెయిల్పై విడుదల అయ్యారు. వీరిలో ఒక నిందితుడు 2012లో చనిపోయాడు.
కానీ, ఓ
స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదుతో నాడు తప్పిపోయిన అమ్మాయిని జలౌన్ పోలీసులు
అరెస్టు చేశారు. ఇప్పుడామె వయసు 26 ఏండ్లు. పెళ్లి కూడా అయింది. మరి నాడు లభించిన మృతదేహం
ఎవరిది? అనే
విషయంలో పోలీసులకు అంతు చిక్కడం లేదు. ఇక ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు
చేస్తున్నారు. ఆ అమ్మాయిని తీసుకువచ్చి
విచారించారు. త్వరలోనే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి వాంగ్మూలాన్ని నమోదు
చేస్తామని పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులకు త్వరలోనే క్లీన్ చీట్ లభించే
అవకాశం కనిపిస్తోంది.