పేపర్ పై జీహెచ్ ఎంసీ బడ్జెట్ భారీగానే కనిపిస్తున్నా ఖర్చు మాత్రం చాలా తక్కువ
By: chandrasekar Fri, 27 Nov 2020 4:11 PM
హైదరాబాద్ అభివృద్ధి
గురించి ‘ఆరేళ్లలో 67 వేల కోట్లు ఖర్చు పెట్టినం’ అని మంత్రి కేటీఆర్
చేసిన ప్రకటనలివి. కానీ, ఈ ఆరేళ్లలో జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.50 వేల
కోట్లు కూడా దాటలేదు. 2014 నుంచి ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ కోసం రూ.41,685 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఒక్క 2014 తప్ప మిగతా సంవత్సరాల్లో రూ.5 వేల
కోట్లకు పైనే బడ్జెట్ ఉంది. పేపర్ పై బడ్జెట్ భారీగానే కనిపిస్తున్నా ఖర్చు మాత్రం
తక్కువగానే ఉంటోంది. ఈ ఆరేళ్లలో అభివృద్ధి పనులకు చేసిన ఖర్చు రూ.16 వేల
కోట్లు కూడా దాటలేదు.
గ్రేటర్హైదరాబాద్లో
శానిటేషన్, మంచినీటి సరఫరా, హౌసింగ్, డ్రైనేజీలు, నాలాలు ఇతర అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ను భారీగా
రూపొందిస్తున్నా.. ఖర్చు మాత్రం పెట్టట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు
మూడేళ్ల నుంచి నయా పైసా గ్రాంట్స్ఇవ్వట్లేదు. దీంతో వివిధ రూపాల్లో వచ్చిన
ఆదాయంతో పాటు, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ
నెట్టుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులు, ప్రజలకు
మౌలిక వసతులు కల్పించడంలో వెనకబడింది. ప్రతి ఏటా వేల కోట్లతో బడ్జెట్పెట్టడం.
అందులో 50 శాతం
కూడా ఖర్చు చేయకపోవడం పరిపాటిగా మారింది. గత ఆరేండ్లలో గ్రేటర్ హైదరాబాద్
బడ్జెట్రూ. 41,685 కోట్లు. కానీ ఇందులో 40 శాతం నిధులు కూడా ఖర్చు
చేయలేదు. టీఆర్ఎస్ విడుదల చేసిన ప్రగతి నివేదిక కలర్ఫుల్ పేజీల్లో తప్ప..
నిజంగా విశ్వనగరం తరహా అభివృద్ధి మాత్రం కనిపించట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. గత
నెల కురిసిన వర్షాలకు గ్రేటర్లోని పలు కాలనీలు జలమయమవడం ఈ విషయాన్ని కళ్లకు
కట్టింది.
కేంద్ర, రాష్ట్ర
ఫైనాన్స్ కమిషన్ల నుంచి అందే గ్రాంట్లు, ఇతర పన్నుల రూపంలో వచ్చే రెవెన్యూ ఆధారంగా
జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏటా అంచనా బడ్జెట్ను తయారు చేస్తోంది. ఫైనాన్షియల్ ఇయర్
ప్రారంభానికి ఆరు నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేసి స్టాండింగ్ కమిటీ అప్రూవల్కు
పంపిస్తారు. అయితే, బడ్జెట్కు ఓకే చెబుతున్నా అందులో పెడుతున్న ఖర్చు
మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రూ.6,973 కోట్ల
బడ్జెట్కు జీహెచ్ఎంసీ పాలకవర్గం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. రాష్ట్ర
బడ్జెట్లోనూ తొలిసారిగా జీహెచ్ఎంసీకి రూ.10 వేల కోట్లు కేటాయించారు. కానీ, ఇప్పటిదాకా
నయా పైసా నిధులను విడుదల చేయలేదు రాష్ట్ర సర్కార్.
రాష్ట్ర ఏర్పాటు వరకు
మిగులు బడ్జెట్తో ఉన్న జీహెచ్ఎంసీ క్రమంగా అప్పుల్లో కూరుకుపోతోంది. రాష్ట్రం
ఏర్పడిన తర్వాత రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడమే
దానికి కారణం. 2014–15 బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రూ.375.93 కోట్లు కేటాయించిన సర్కార్.. రూ.288.14 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2015–16లో రూ.428 కోట్లు కేటాయించి.. కేవలం రూ.23
కోట్లతోనే సరిపెట్టింది. 2016–17లో రూ.70.30 కోట్లు కేటాయించి.. రూ.1.32
కోట్లే ఇచ్చింది. 2017–18 బడ్జెట్లో ప్రణాళికేతర నిధుల కింద రూ.67.28
కోట్లు కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 2018–19, 2019–20 బడ్జెట్లలో అసలు నిధులే కేటాయించలేదు.
ఆరేళ్లు కలిపి రూ.వెయ్యి
కోట్లు కూడా ఇవ్వని సర్కారు. హైదరాబాద్ మహానగరంపై నిర్లక్ష్యం చూపించింది. అయితే, ఈ
ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండడం వల్లే రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల
కోట్లు కేటాయించిందన్న విమర్శలున్నాయి. అయితే, అవి జస్ట్ కేటాయింపుల వరకే పరిమితమయ్యాయి.
ఇప్పటిదాకా నిధులు రిలీజ్ చేయలేదు. గ్రేటర్ ఎన్నికలయ్యాక కూడా కేటాయించిన
నిధులను ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జస్ట్ ఎన్నికల స్టంట్ కోసమే
అలాంటి ప్రకటనలను రాష్ట్ర సర్కార్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.