కరోనా వాక్సిన్ ‘కోవాక్సిన్’ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ఆశాజనకం
By: chandrasekar Mon, 27 July 2020 10:30 PM
కరోనాకి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణెలోని
నేషనల్ వైరాలజీ ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దేశీయ కరోనా టీకా
‘కోవాక్సిన్’ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో
నిర్వహిస్తున్నారు. పది రోజుల కిందట హరియాణా రోహతక్లోని పోస్ట్గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్ - పీఐఎంఎస్ లో వాలంటీర్లపై ప్రయోగించారు. దీనికి సంబంధించిన
ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని పీజీఐఎంఎస్ ప్రకటించింది.
వ్యాక్సిన్ ట్రయల్స్
నిర్వహించేందుకు మొత్తం 12 ఇనిస్టిట్యూట్ లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన సంగతి
తెలిసిందే. రెండు రోజుల కిందట ఢిల్లీ ఎయిమ్స్లో సైతం 30ఏళ్ల
యువకుడికి తొలి దశ వ్యాక్సిన్ను డోస్ ఇచ్చారు. కోవాక్సిన్తో పాటు జైడస్ కాడిలా
వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్కు సైతం డీసీజీఐ అనుమతించింది.
భారత్ బయోటెక్ కోవాక్సిన్ను
మృత కరోనా వైరస్ కణాలతో రూపొందించింది. ఈ వ్యాక్సిన్ను నియమిత డోస్లో ఇస్తే, శరీరంలో
కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారవుతాయని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లూ ఉండబోవని
పరిశోధకులు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలావుండగా, పీజీఐఎంఎస్లో తొలి దశ ట్రయల్స్ జులై 17న
ప్రారంభమయ్యాయి.
ప్రయోగనిమిత్తం 50 మంది
వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చామని, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఇనిస్టిట్యూట్
ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సవితా వర్మ వెల్లడించారు. రెండో దశ ట్రయల్స్లో
భాగంగా శనివారం ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. పాట్నా ఎయిమ్స్లో సైతం 9 మంది
వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్ తయారీ మరియు ఉత్పత్తి
ఆధారపడివుంటుంది. ఫలితాలు విజయవంతమైతే త్వరలోనే కరోనా ని కట్టడి చేయవచ్చు.