Advertisement

  • తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు

తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు

By: chandrasekar Thu, 22 Oct 2020 09:18 AM

తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు


తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, కార్మిక నాయకుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు.

దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు అపోలోకు తరలించారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అపోలో నాయినిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కానీ రాత్రి పొద్దుపోయాక నాయిని ఆరోగ్యం క్షీణించింది. నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయానన్నారు. నాయిని మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి, కార్మిక లోకానికి తీరనిలోటని తెలిపారు.

అయన పూర్తి రాజకీయ ప్రయాణం పరిశీలించినట్లయితే మంత్రి నాయిని నర్సింహారెడ్డి 1934 మే 12న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో దేవయ్యరెడ్డి, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య అహల్యారెడ్డి, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమంతరెడ్డి ఉన్నారు. హెచ్‌ఎస్‌సీ వరకు విద్య నభ్యసించిన నాయిని 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1969లో జయప్రకాశ్‌నారాయణ శిష్యుడిగా జనతాపార్టీ నుంచి రాజకీయజీవితాన్ని ప్రారంభించారు. 1978, 1985లో జనతాపార్టీ తరఫున ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ప్రజల్లో మంచి గుర్తింపు పొందడంతో 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్‌ 2న ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎంపికైన ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్‌తో ముగిసింది. నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన నాటినుంచి తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడిచారు. ఇందువల్ల తెరాసలో తీవ్ర విషాదం నెలకొంది.

Tags :

Advertisement