Advertisement

  • డబ్బు కోసం పెళ్లి పేరుతో ఎన్నారై ని మోసం చేసిన యువతీ కుటుంబం

డబ్బు కోసం పెళ్లి పేరుతో ఎన్నారై ని మోసం చేసిన యువతీ కుటుంబం

By: Dimple Fri, 17 July 2020 4:16 PM

డబ్బు కోసం పెళ్లి పేరుతో ఎన్నారై ని మోసం చేసిన యువతీ కుటుంబం


గతంలో పిల్లలకు పెళ్లి చేయాలంటే బంధువులు, స్నేహితులు, లేదా పరిచయస్తుల ద్వారా సంబంధాలు వెతికేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ కాలం కావడంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా సంబంధాలు కుదుర్చుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ముఖ్యంగా ఎన్నారైలను టార్గెట్ చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు.

ఇలాగే హైదరాబాద్‌కు చెందిన యువతి కుటుంబం
ఎన్నారై యువకుడికి టోకరా వేసి ఏకంగా రూ.3కోట్లు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం సీసీఎస్‌కు బదిలీ చేశారు.
హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన సత్యనారాయణరావు కుమారుడు సుధీర్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు అతడికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తన వివరాలను మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. నగరానికే చెందిన ఓ యువతి డాక్టర్ నియతి వర్మగా ప్రొఫైల్‌ క్రియేట్ చేసుకుని సుధీర్‌ను సంప్రదించింది. ప్రొఫైల్‌లో యువకుడి తండ్రి సత్యనారాయణ ఫోన్ నంబర్ ఉండటంతో ఆయనకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అని చెప్పింది.

ఈ విషయాన్ని ఆయన అమెరికాలో ఉండే కొడుక్కి చెప్పాడు. ఆ తర్వాత సుధీర్‌తోనూ ఆమె ఫోన్లో మాట్లాడటంతో ఇద్దరూ తమ వివరాలు షేర్ చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత సుధీర్‌కు ఫోన్ చేసిన ఆమె తన ఆస్తులు గొడవల్లో ఉన్నాయని, మనశ్శాంతి కోసం ఓ అనాథ శరణాలయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పింది. దీనికోసం నిధులు సేకరిస్తున్నట్లు నమ్మించి 2016 నుంచి పలు దఫాలుగా రూ.3కోట్ల వరకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. నియతి వర్మ కుటుంబసభ్యులుగా చెప్పుకుంటూ కొందరు సత్యనారాయణను అనేకసార్లు కలిసిమాట్లాడేవారు. కానీ పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా దాటవేస్తూ వచ్చారు.

ఇటీవల వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆయన ఆరా తీయగా తమతో మాట్లాడింది నియతి వర్మ కాదని.. దేవతి మాళవిక అనే యువతి అని తెలుసుకుని షాకయ్యారు. ఆమె కుటుంబసభ్యులు దేవతి శ్రీనివాస్, ప్రణవం, గజలక్షి ఆమెకు సహకరించి డబ్బులు దోచుకునేందుకు సహకరించారని తెలిసింది. దీంతో సత్యనారాయణ వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. వీరంతా ప్లాన్ ప్రకారం తమను మోసం చేశారని తెలుసుకుని సత్యనారాయణ జూన్ నెలలో ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి సీసీఎస్‌కు బదిలీ చేశారు.

Tags :
|
|
|

Advertisement