ముంబై వైపు ముంచుకొస్తున్న నిసర్గ తుఫాను... మహా సర్కార్ హై అలర్ట్
By: chandrasekar Thu, 04 June 2020 6:31 PM
దేశ ఆర్థిక రాజధాని ముంబై
వైపు నిసర్గ తుఫాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాను
వేగంగా ముంబై తీరంవైపు వస్తోంది. రేపు మధ్యాహ్నం వరకు తుఫాను తీరందాటే అవకాశాలు
ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో రానున్న 12
గంటల్లో నిసర్గ అతి తీవ్ర తీఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే
హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ
గుజరాత్ మధ్య హరిహరేశ్వర్, డామన్ మధ్య బుధవారం మధ్యాహ్నం ఈ తుఫాను తీరం దాటే
అవకాశం ఉందని తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. అంతేగాక, 120
కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరించింది. రాయగఢ్
జిల్లాలో ఉన్న హరహరేశ్వర్ ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో ఉండగా, డామన్
ముంబైకి 170
కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోవైపు నిసర్గ తుఫాను నేపథ్యంలో ముంబై తీరంలో 144
సెక్షన్ విధించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఈ
ఉత్తర్వులు అమల్లో ఉంటాయని మహారాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. ఒకరి కంటే ఎక్కువ
మంది బీచ్, పార్కుల వద్ద, పబ్లిక్ ప్రాంతాల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని
పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే తుఫాను ప్రభావిత
ప్రాంతాల్లోని ప్రజలను, ఆస్పత్రుల నుంచి రోగులను ఇతర సురక్షిత ప్రాంతాలకు
తరలించారు. తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు
మోహరించాయి. మొత్తం 16 బృందాలు రంగంలోకి దిగినట్లు సీఎం కార్యాలయం
తెలిపింది. ఇవాళ ఉదయం నుంచే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి.
ఏపీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తుఫాను సహాయక చర్యలకోసం ప్రత్యేక విమానంలో ముంబైకు
చేరుకుంది.
తుఫాను నేపథ్యంలో
ముంబైతోపాటు తీర ప్రాంతం కలిగివున్న థానే, పాల్ఘర్, రాయగఢ్, రత్నగిరి, సింద్దుర్ఘ్ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇక
గుజరాత్ తీర ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. తుఫాను
ప్రభావంతో ఇప్పటికే ముంబైతోపాటు ఇతర తీర ప్రాంతాల్లో సైతం వర్షాలు కురుస్తున్నాయి.
నిసర్గ తుఫాను నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, గుజరాత్
ముఖ్యమంత్రి విజయ్ రూపానీలతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం
ఉంటుందని ప్రధాని వారికి భరోసా ఇచ్చారు.