కరోనా సోకిన యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పరార్
By: chandrasekar Mon, 22 June 2020 5:17 PM
ప్రస్తుతం కరోనా కేసులు
ఎక్క్కువగా నమోదవుతున్న నేపథ్యంలో యూపీలో ఒక సంఘటన చోటు చేసుకుంది. కరోనా
పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పారిపోయారు. దీంతో ఓ 40
కుటుంబాలను క్వారంటైన్ లో ఉంచారు పోలీసులు, వైద్యాధికారులు. యూపీలోని హర్దోయి జిల్లాకు చెందిన ఓ
కుటుంబం గత కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లారు. ఢిల్లీ నుంచి ఈ నెల 15వ
తేదీన తమ సొంత గ్రామమైన తెర్వాదహిగావన్ కు చేరుకున్నారు. 16వ
తేదీన ఓ పెళ్లికి వారు హాజరయ్యారు. అయితే ఈ కుటుంబంలో ఇద్దరికి కరోనా లక్షణాలు
కనిపించడంతో రక్త నమూనాలను వైద్యులకు ఇచ్చారు.
మొత్తం కుటుంబ సభ్యులైన
ఆరుగురిలో 18 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆ కుటుంబం వద్దకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు.
అంతలోపే యువకుడితో పాటు మిగతా కుటుంబ సభ్యులు పారిపోయారు. ముందస్తు జాగ్రత్తగా
ఆ గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోని 40 కుటుంబాలను క్వారంటైన్
లో ఉంచారు. యువకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువకుడితో పాటు అతని
కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు వెదుకుతున్నారు.