ఆంధ్రలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రం
By: chandrasekar Thu, 18 June 2020 1:32 PM
ఏపీని కరోనా మహమ్మారి
వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి.
రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24
గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,188 శాంపిల్స్ పరిశీలిస్తే 275మందికి
కరోనా పాజిటివ్గా తేలినట్లు మీడియా బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర
రాష్ట్రాలు (50), విదేశాల నుంచి (26)
వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 351
కేసులు నమోదయ్యాయి.
కొన్ని రోజులుగా జిల్లాల
వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి
సంబంధించిన కేసులు 5555కు (మొత్తం 5636కు) చేరాయి. మరో 55మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో
డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2559కు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా
కర్నూలు జిల్లాలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు
పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2906మందికి
నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా
కరోనాతో మొత్తం 90మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల
కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన
వారు ఎక్కువమంది ఉన్నారు.
రాష్ట్రంలో కొత్త నమోదైన
పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కుమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 1253(వీటిలో
యాక్టివ్ కేసులు 562) ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 263మందికి
వైరస్ సోకినట్లు తెలియజేశారు. ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి వచ్చిన వారితో టెన్షన్
వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది.