Advertisement

  • అర్ధరాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లి పట్టుబడ్డ ప్రియుడు

అర్ధరాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లి పట్టుబడ్డ ప్రియుడు

By: chandrasekar Tue, 24 Nov 2020 10:12 AM

అర్ధరాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లి పట్టుబడ్డ ప్రియుడు


అర్ధరాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లి ప్రియుడు పట్టుబడ్డ సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓయువకుడు తన ప్రియురాలిని కలుసుకోవటానికి తరచూ అర్ధరాత్రి వేళ పొరుగు ఊరిలోని ఆమె ఇంటికి వస్తున్నాడు. ఆమె తన కుటుంబసభ్యులందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత ఇంటి వెనుక డోర్ తీసి ప్రియుడిని రప్పించుకుంటోంది. చాలా రోజులుగా ఈ తంతు సాగుతోంది. అర్ధరాత్రి బాగా పొద్దుపోయేవరకు వారిద్దరూ రొమాన్స్ చేయడం, ఆ తర్వాత యువకుడు తాను వచ్చిన దారినే వెళ్లిపోవడం జరుగుతోంది. కానీ, అన్ని రాత్రులూ ఒక్కలా వుండదుకదా. మూడు రోజుల కిందట అర్ధరాత్రి అమ్మాయి గది నుంచి ఏదో అలికిడి వినిపించడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో వారిద్దరి బాగోతం బట్టబయలైంది. తమ అమ్మాయితో ఆ యువకుడు ఏకాంతంగా ఉండటం చూసి వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అతడిని అదే గదిలో బంధించి చితక్కొట్టారు. ఆ అరుపులకు ఇరుగు పొరుగు వాళ్లు కూడా నిద్ర లేచొచ్చారు. విషయం తెలుసుకొని తలో చెయ్యేశారు. దీంతో ఆ యువకుడికి ఆ రాత్రి కాళరాత్రిగా మారింది. ఇక తెల్లారేసరికి ఎక్కడ కొట్టి చంపేస్తారో అని భయం భయంగా గడిపిన ఆ యువకుడి జీవితంలో ఉదయం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడం, పెద్దలు కలుగజేసుకొని ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదర్చడంతో మధ్యాహ్నమయ్యే సరికి వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. తాను తన్నులు తిన్నచోటే ఆ యువకుడు 24 గంటలు తిరిగేసరికి తన ప్రేయసితో మళ్లీ రొమాంటిక్‌గా గడిపాడు. ఈసారి అదికూడా నిర్భయంగా.

ఈ రొమాంటిక్ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు ప్రేమ్ సింగ్. అతడిది యూపీలోని రామ్‌పూర్ పరిధిలోని నగ్లీ గ్రామం. అతడి ప్రియురాలు ఉండేది అక్కడికి కొంత దూరంలోని సుమలీ గ్రామం మెహిందీ నగర్‌. ఆమె పేరు లక్ష్మి. అర్ధరాత్రి వేళ తమ అమ్మాయితో ఉన్న ప్రేమ్ సింగ్‌ను చితకబాదిన యువతి కుటుంబసభ్యులు ఆ మరుసటి రోజు పోలీసులకు అప్పగించారు. అతడిపై, అతడి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు. ఇక్కడితో కథ ముగిస్తే ఇది మరోలా ఉండేది. కానీ, ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. విషయం తెలుసుకున్న అబ్బాయి, అమ్మాయి తరపు పెద్దలు పోలీస్ స్టేషన్‌లోనే పంచాయతీ పెట్టారు. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. అమ్మాయి కుటుంబసభ్యులు యువకుడిపై సారీ, తమకు కాబోయే అల్లుడిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. అక్కడికి సమీపంలోని ఓ ఆలయంలో వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించారు. యువకుడిని అమ్మాయి కుటుంబసభ్యులు చితకబాదిన దృశ్యాలు, ఆ తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాత్రంతా చితక్కొట్టిన వ్యక్తిని ఇప్పుడు అల్లుడిగా ఎలా గౌరవిస్తారు అని అమ్మాయి తల్లిదండ్రులను అడిగితే ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యం అని నవ్వుతూ బదులిచ్చారు. ఏదేమైనా ప్రేమ్ సింగ్ మాత్రం ఆ రాత్రిని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు! ముందు విందు పెట్టి మళ్ళి పెళ్లి చేసిన సంఘటన రసవత్తరంగా ముగిసింది.

Tags :
|

Advertisement