బావిలో మృతదేహాలు
By: chandrasekar Sat, 23 May 2020 5:23 PM
వరంగల్ నగర శివారు రూరల్
జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలో బావిలో మృతదేహాల ఘటన తీవ్ర కలకలం
రేపుతోంది. మొదట నాలుగు మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. శుక్రవారం మరో ఐదు
మృతదేహాలను బయటకు తీశారు. బావిలో ఇంకా మృతదేహాలున్నాయా? అన్న అనుమానంతో గాలిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్కు చెందిన
మక్సూద్ 20 ఏళ్ల
క్రితం కుటుంబంతో సహా వరంగల్ వలస వచ్చాడు. వీరు గత ఏడాది డిసెంబరు నుంచి
గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న గన్నీ సంచుల తయారీ గోడౌన్లో పనిచేస్తున్నారు. వరంగల్లోని
కరీమాబాద్ ప్రాంతంలో వీరు అద్దెకు ఉండేవారు.
కానీ లాక్డౌన్ వల్ల ఇంటి
నుంచి రావడానికి ఇబ్బందిగా ఉండటంతో.. కొద్ది రోజుల నుంచి గోదాంలో ఉన్న రెండు
గదుల్లోనే మక్సూద్ దంపతులు, వారి
ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తకు దూరంగా ఉంటున్న కుమార్తె బుస్ర సైతం.. తన
కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. బిహార్కు చెందిన ఇద్దరు యువకులు
సైతం గోడౌన్లోని మరో గదిలో ఉంటూ పని చేస్తున్నారు. మొత్తం 8 మంది ఒకే ప్రాంగణంలో నివాసం ఉంటూ ఉపాధి
పొందుతున్నారు. గోడౌన్ యజమాని సంతోష్ గురువారం మధ్యాహ్నం అక్కడికి వచ్చే సరికి
పనిచేసే వారెవరూ కనిపించలేదు. ఆ ప్రాంగణం మొత్తం పరిశీలించగా పాడు బడిన బావి
సమీపంలో వారి వస్తువులు కనిపించాయి. బావిలోకి చూడగా నాలుగు మృతదేహాలు కనిపించాయి.
దీంతో వెంటనే గీసుకొండ
పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్టీం, డాగ్స్క్వాడ్
సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది మరియు విపత్తు
నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు
కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు. శుక్రవారం ఉదయం మరో ఐదు మృతదేహాలను
గుర్తించి బయటకు తీశారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు
నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 9
మృతదేహాల్లో ఆరుగురు మక్సూద్ కుటుంబసభ్యులే కాగా.. మిగిలిన వారెవరనేది మిస్టరీగా
మారింది. వీరందరిపై విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల మక్సూద్
మనవడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా.. ఆ వేడుకల్లో మక్సూద్ కూతురి విషయంలో
బిహార్ యువకులు, స్థానికుల
మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.