బీజేపీ నగర ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తమపై విమర్శలు మాత్రం చేస్తున్నారు...
By: chandrasekar Sat, 21 Nov 2020 5:52 PM
గ్రేటర్ హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్..
బీజేపీ, కాంగ్రెస్
పార్టీలపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన
తర్వాతే హైదరాబాద్ అభివృద్ధి పరుగులు పెట్టిందని అన్నారు. జీహెచ్ఎంసీలో చేపట్టిన
అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో ప్రగతి నివేదికను తెలంగాణ భవన్లో ఆయన
విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థులకు
కేటీఆర్ నిర్దేశం చేశారు. టికెట్లు వచ్చినవారు నిరాశ చెందిన వాళ్లను కలుపుకునిపోయి
విజయం సాధించాలని మంత్రి సూచించారు. ఈ పది రోజులూ నిరంతరం శ్రమించి గ్రేటర్పై
గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రగతిని నివేదించాల్సిన బాధ్యత
అభ్యర్థులపై ఉందని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇదే కేసీఆర్ చట్టం..
మహిళలకే 50శాతం
సీట్లు
మొత్తం 150
డివిజన్లలో సగం డివిజన్లను మహిళలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చట్టం తెచ్చారని, అన్ని
కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశామని కేటీఆర్ చెప్పారు. 85
డివిజన్లు మహిళలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. సమయం తక్కువ ఉన్నందున టీఆర్ఎస్
అభ్యర్థులు బీఫామ్ సమర్పించిన తర్వాతే జనంలోకి వెళ్లాలని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్ నగరంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ తమ ప్రభుత్వ ఘనతేనని చెప్పారు. ప్రజల
తాగునీటి సమస్యను తీర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
కేసీఆర్ సర్కారు వచ్చాకే హైదరాబాద్ లో పేకాట, గుడుంబా
క్లబ్బులు మూతపడ్డాయన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని కేటీఆర్
తెలిపారు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
భాగ్యనగరం బాగుంటేనే తెలంగాణ ఉజ్వలంగా దూసుకెళ్తుందని కేటీఆర్ చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్
పార్టీలపై కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు నగరానికి
చేసేదేమీ లేదన్నారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న అభివృద్ధి కావాలా? అరాచకాలు, ఘర్షణలతో
కూడిన హైదరాబాద్ కావాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఆరేళ్లపాలనలో
హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చారు. వరద బాధితులను ప్రభుత్వం
ఆదుకుంటుందన్నారు. బీజేపీ నేతలు నగర ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తమపై విమర్శలు
మాత్రం చేస్తున్నారని
మండిపడ్డారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచామని, ఈసారి మాత్రం సెంచరీ
కొట్టడం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.