Advertisement

  • సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కేసు...నేడే తుది తీర్పు

సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కేసు...నేడే తుది తీర్పు

By: chandrasekar Wed, 30 Sept 2020 10:03 AM

సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కేసు...నేడే తుది తీర్పు


బుధవారం (సెప్టెంబర్ 30)న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు రానుంది. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసు తుది దశకు రావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠకు మరో కారణం ఈ కేసులో బీజీపీ ఎల్‌కే అద్వానీ సహా సీనియర్ నేతలు ఉండటం. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో తుది తీర్పు చెప్పనుంది. ఈ నేపథ్యంలో కోర్టు వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ విధించారు.

బాబ్రీ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని తీర్పు సమయంలో కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ సెప్టెంబర్‌ 16న ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేసి, తీర్పు వెలువరించాలని సుప్రీం కోర్టు ఇదివరకే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది.

బాబ్రీ మసీదు కూల్చివేత 1992 డిసెంబర్‌ 6న సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌, గిరిరాజ్‌ కిషోర్‌, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌ సింగ్‌ ఉన్నారు. కానీ, 2003 సెప్టెంబర్‌ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ అద్వానీ, జోషీకి విచారణ నుంచి విముక్తి కల్పించింది. ఈ అంశంపై మరోసారి దుమారం రేగడంతో దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వారి పేర్లను మళ్లీ చేర్చారు. కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్‌ సింగ్‌‌ను కూడా విచారించాలని సుప్రీం కోర్టు 2017లో స్పష్టం చేసింది. దీంతో విచారణలో వీరి పేర్లను చేర్చారు. ప్రస్తుతం ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్‌‌కు కరోనా నిర్ధారణ అయింది. వీరిద్దరూ వేర్వేరు హాస్పిటల్‌లలో చికిత్స పొందుతున్నారు. అయితే తీర్పు సమయంలో వీరు కోర్టుకు హాజరవుతారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తుది తీర్పును వెలువరిస్తూ నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ బాబ్రీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘1992 డిసెంబర్‌ 6న కరసేవకులు వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్‌ మూలాలను దెబ్బతీయడానికి ‍ప్రయత్నించారు. ఈ అంశంలో ముస్లిం వర్గాలకు కచ్చితంగా న్యాయం జరగాల్సిందే’ అని రంజన్‌ గొగోయ్‌ తెలిపారు.

Tags :

Advertisement