పదో తరగతి పరీక్షల రద్దుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
By: chandrasekar Wed, 15 July 2020 11:35 AM
పదో తరగతి పరీక్షలను
రద్దు చేస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన
ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను మాత్రం ప్రకటించలేదు. ఈ మేరకు ప్రభుత్వం
అధికారిక ఉత్తర్వులు జారీ చేసి పదో తరగతి హాల్ టికెట్లు తీసుకున్న విద్యార్థులంతా
పాస్ అయినట్లేనని ప్రకటించింది. అయితే పాస్ అయిన విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్లు
ప్రకటించడం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ ఏడాది మార్చి 23నుంచి
ఏప్రిల్ 8 వరకు
ఏపీ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని అప్పట్లో నిర్ణయించగా స్థానిక
ఎన్నికలు ఉండటంతో పరీక్షల షెడ్యూల్ను మార్చి 31 నుంచి ఏప్రిల్ 17కు వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనావైరస్ వ్యాప్తి
కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించడంతో పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు.
ఆ తర్వాత 11
పేపర్లకు బదులు 6పేపర్లకు కుదించి ఏప్రిల్ 10 నుంచి
17వ తేదీ
వరకు పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేసింది. కరోనా వ్యాప్తి
అధికంగా ఉండటంతో నిర్వహణ సాధ్యం కాదని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి
తెలియజేశారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పదో తరగతి పరీక్షలను
రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ
ప్రకటించింది.