రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ
By: chandrasekar Sat, 01 Aug 2020 12:12 PM
మూడు రాజధానుల బిల్లుకు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన తర్వాత కొన్ని గంటల్లోనే ప్రభుత్వం
గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాజధాని వికేంద్రీకరణ వెంటనే
అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి గొంతు
మనోహర్ రెడ్డి పేరుతో ఈ గెజిట్ విడుదల అయింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం
రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమల్లోకి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మొత్తానికి ఒకేసారి అమల్లోకి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ
అమరావతిలో కొలువవుతుంది. రాజ్ భవన్, సచివాలయం, హెచ్ ఓడీల కార్యాలయాలు కార్యనిర్వాహక రాజధాని
విశాఖపట్నంలో ఉంటాయి. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుంది. హైకోర్టు బెంచ్ను
ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఏ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి, అందుకు
కారణాలు ఏంటనే అంశాన్ని ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేస్తుంది.
అమరావతి మెట్రో పాలిటన్
రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను శాసనరాజధానిగా పిలుస్తారు.
విశాఖపట్నం మెట్రోపాలిటన్
రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పిలుస్తారు.
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్
ఏరియాను జ్యూడీషియల్ క్యాపిటల్గా పిలుస్తారు.
మూడు రీజియన్లను ఏపీ
మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చట్టం - 2016 కింద
నోటిఫికేషన్ జారీ చేసి ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రంలో జోన్ల
అభివృద్ధికి ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయవచ్చు. ఆ జోన్ల గురించి ప్రత్యేకంగా
నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. ఆ బోర్డులకు కొన్ని అధికారాలను కూడా కట్టబెట్టే అవకాశం
ఈ బిల్లు ద్వారా లభిస్తుంది. ఈ బోర్డుల బాధ్యతలు నిర్వహించే వారు అధికారుల నుంచి
సమాచారం కోరే అధికారం ఉంటుంది. జోన్ల అభివృద్దికి సూచనలు, సలహాలు
ఇవ్వవచ్చు. జోన్లలో అభివృద్దికి సంబంధించి సమీక్షలు కూడా నిర్వహించే అధికారం కలిగి
ఉంటుంది.