ఉత్కంఠ పోరాటాలతో సాగే ఐపీఎల్ 13వ సీజన్ నేటి నుంచి ప్రారంభం
By: chandrasekar Sat, 19 Sept 2020 11:51 AM
భారత్ పాటు విదేశీ
స్టార్లతో కళకళలాడే జట్లతో అన్నింటికీ మించి మైదానంలో ఉత్కంఠ పోరాటాలు, ఆటగాళ్ల
భావోద్వేగాలు.. వీటిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్న క్రికెట్
అభిమానుల నిరీక్షణ ముగిసే సమయం వచ్చింది. యూఏఈ
వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ
సీజన్ నేడు ప్రారంభం కానుంది. కరోనా వైరస్ ప్రభావంతో విసిగి పోయిన కోట్లాది మందిలో ఈ క్రికెట్ వేడుక ఉత్సాహం
నింప బోతోంది. మొత్తంగా 53 రోజుల పాటు క్రికెట్ ప్రపంచంలోకి
తీసుకెళ్లనుంది. సినీ తారలతో అట్టహాసంగా
జరిగే ప్రారంభ వేడుక, మ్యాచ్ల్లో అభిమాన క్రికెటర్ల, అరిచే
ప్రేక్షకులు, చీర్లీడర్ల చిందులు ఇవేవీ లేకుండా ఈ ఏడాది ఐపీఎల్ వినూత్నంగా జరుగనుంది.
కరోనా వైరస్తో ఆందోళనలో
ఉన్న ప్రపంచాన్ని క్రికెట్ లోకంలోకి తీసుకెళ్లి అలరించేందుకు ఐపీఎల్
సిద్ధమైంది. శనివారం అబుదాబి వేదికగా
ఐపీఎల్ 13వ
సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై
సూపర్ కింగ్స్ డీకొంటున్నాయి.. సుదీర్ఘ కాలం పాటు క్రికెట్కు దూరంగా ఉండి ఇటీవల
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీని
చూసేందుకు ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణ ముగిసిపోనుంది. యూఏఈలోని దుబాయ్(24), అబుదాబి
(20), షార్జా(12) మూడు
వేదికల్లో 53 రోజుల పాటు 60
మ్యాచ్లుగా నవంబర్ 10న ఫైనల్ వరకు ఐపీఎల్ జరుగనుంది.
సమతూకంతో ఎనిమిది జట్లు
సిద్ధం
ఎనిమిది జట్లను చూస్తే
టైటిల్ కోసం ఈసారి పోరు మరింత హోరాహోరీగా జరుగడం ఖాయంగా కనిపిస్తున్నది. రోహిత్
శర్మ సారథ్యంలో బిగ్ హిట్టర్లతో ముంబై
భీకరంగా ఉంటే దిగ్గజ సారథి ధోనీ, డుప్లెసిస్, వాట్సన్ లాంటి సీనియర్లతో డాడీస్ ఆర్మీ చెన్నై
సూపర్ కింగ్స్ ఎప్పటిలాగానే టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్
వార్నర్ నేతృత్వంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగ్ గా ఉంది. తొలిసారి టైటిల్ కొట్టాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
కెప్టెన్ విరాట్ కోహ్లీ కసితో ఉండగా సమతూకంతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ సైతం అదే
లక్ష్యాన్ని పెట్టుకుంది. కోల్ కతా నైట్రైడర్స్
మూడో టైటిల్ ఆశతో ఉంటే. రాజస్థాన్ రాయల్స్ పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది.
శుభారంభం చేయాలని
పట్టుదలతో టీమ్స్
ఐపీఎల్ 13వ
సీజన్ తొలి మ్యాచ్లో టైటిల్ ఫేవరెట్లు ముంబై ఇండియన్స్, చెన్నై
సూపర్ కింగ్స్ శనివారం తలపడనున్నాయి. చాలా సీజన్లలో తొలుత తడబడిన ముంబై అబుదాబి
వేదికగా తొలి పోరుతోనే శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్తో యూఏ ఈ పిచ్లు, వాతావరణ
పరిస్థితులపై ఓ అంచనా రానుంది. కాగా అబుదాబి పిచ్ బౌలర్లకే అనుకూలించే అవకాశం ఉంది. రోహిత్, డికాక్, హార్దిక్, కృనాల్
పాండ్య, పొలార్డ్, బుమ్రా
ఇలా స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ముంబై ఎంతో పటిష్టంగా ఉంది. మరోవైపు
వ్యక్తిగత కారణాలతో సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా సీజన్ నుంచి తప్పుకోవడం లోటే
అయినా చెన్నై కూడా స్ట్రాంగ్ గానే ఉంది.
కెప్టెన్ ధోనీ, వాట్సన్, రాయుడు, జాదవ్, జడేజా లాంటి మ్యాచ్ విన్నర్లతో పటిష్టంగానే
కనిపిస్తున్నది.
నూతన౦గా....
కరోనా కారణంగా టీ20
క్రికెట్కే వన్నెలద్దిన ధనిక లీగ్ ఐపీఎల్ ఈసారి వినూత్నంగా జరుగనుంది. మార్చిలో
ప్రారంభం కావాల్సిన టోర్నీ మహమ్మారి వల్ల ఆరు నెలలు ఆలస్యమైంది. ప్రతీసారి
సినీతారల తళుకుబెళుకులు, డ్యాన్స్లతో హోరెత్తే ఆరంభ వేడుకతో ప్రారంభమయ్యే
లీగ్.. ఈసారి హడావుడి లేకుండా నిరాడంబరంగా
మొదలవనుంది. ఇక మహమ్మారి దెబ్బతో ప్రేక్షకుల్లేకుండా బోసిపోయే స్టేడియాల్లో
మ్యాచ్లు జరుగనుండడంతో ఇంతకు ముందు రికార్డు చేసిన కేరింతలను ప్లే చేయాలని
నిర్వాహకులు భావిస్తున్నారు. క్వారంటైన్
పూర్తి చేసుకొని లీగ్లో ఆడుతున్న ఆటగాళ్లు మొత్తం తమ జట్టు మ్యాచ్లు అయిపోయే
వరకు బయో బబుల్ దాటేందుకు వీలు లేదు. ప్రామాణిక నిర్వహణ పద్ధతి(ఎస్వోపీ)ని తూచా
తప్పకుండా పాటించాల్సిందే. ఇక కరచాలనాలు, ఆలింగనాలు ఎక్కువగా కనిపించకవు.