ధోనీపై ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరగడానికి కారణం అదే: వీవీఎస్ లక్ష్మణ్
By: chandrasekar Thu, 20 Aug 2020 12:53 PM
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రముఖ ఆటగాళ్లతో పాటు, మాజీలు కూడా ధోని వ్యక్తిత్వం, ఆటపై తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీపై ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరగడానికి కారణం తన ఆఫ్-ఫీల్డ్ ప్రవర్తనేనని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్ట్లో ఆయన మాట్లాడుతూ ‘భారత జట్టుకు నాయకత్వం వహించడం ఎవరికైనా కష్టతరమైన సవాలే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరి నుంచి చాలా అంచనాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ భారత జట్టు బాగా రాణించాలని కోరుకుంటారు. కాబట్టి భారత జట్టు కెప్టెన్పై చాలా బాధ్యత ఉంటుంది. కానీ ఎంఎస్ ధోని ఎప్పుడూ ఫలితాలపై మానసికంగా కృంగి పోడని’ అన్నారాయన.
ధోని మానసికంగా ధృడంగా ఉంటాడని, అందువల్లే అతడిని ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానిస్తారన్నాడు. ‘అభిమానుల విషయానికొస్తే ధోని ప్రతి కదలికను వారు గమనిస్తారని నేను భావిస్తున్నా. అతడి ఆటను ప్రతి క్రికెట్ అభిమాని ఆనందిస్తాడు. ధోని క్రికెట్ మైదానంలో గడిపిన ప్రతి క్షణాన్ని వారు ఆస్వాదిస్తారని’ లక్ష్మణ్ తెలిపారు. ‘సోషల్ మీడియాలో మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులే కాకుండా సినీ తారలు, సామాజికవేత్తలు, గౌరవనీయ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ధోని రిటైర్మెంట్పై స్పందించి ప్రపంచ క్రికెట్కు ధోని చేసిన సేవలను గుర్తు చేసుకున్నారని’ ఈ మాజీ బ్యాట్స్మెన్ చెప్పుకొచ్చాడు.