పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం... దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి
By: chandrasekar Tue, 27 Oct 2020 11:57 AM
పశ్చిమ బెంగాల్
రాష్ట్రంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పడవ మునిగి అపశ్రుతి
చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు పలువురు
గల్లంతయ్యారు. బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాలో సోమవారం
దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా నీటిలో ఓ పడవ మునిగిపోయింది. దీంతో
పడవలో ఉన్న వారు గల్లంతయ్యారు.
సమచారం మేరకు ఘటనా
స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అనంతరం ఇప్పటివరకు
నాలుగు మృతదేహాలను బయటకి తీశారు. మృతులను సుఖేందు దే (21), పికోన్
పాల్ (23), అరిందం
బెనర్జీ (20), సోమనాథ్ బెనర్జీ (22) లుగా పోలీసులు
గుర్తించారు. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన జరిగిందని.. ఇంకా
గల్లంతైన పలువురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే గజ ఈతగాళ్లతో ఈ
ప్రాంతంలో రెస్క్యూ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పడవ
మునిగినప్పుడు ఐదుగురు ఉన్నట్లు చెబుతున్నారు. ఎంతో సందడిగా సాగుతున్న దుర్గామాత
విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో నీటిలో పడవ బోల్తా పడి పలువురు గల్లంతవ్వడంతో
ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగాలో తీవ్ర విషాదం మిగిల్చింది.