- హోమ్›
- వార్తలు›
- భారత్-చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తతలు – యుద్ధానికి సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసిన జిన్పింగ్
భారత్-చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తతలు – యుద్ధానికి సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసిన జిన్పింగ్
By: chandrasekar Wed, 27 May 2020 6:06 PM
యుద్ధానికి సన్నద్ధం
కావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జాతీయ భద్రతపై కనిపించే ప్రభావానికి వ్యతిరేకంగా
యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండాలని సాయుధ బలగాలను జిన్పింగ్ మంగళవారం మే 26 ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ దేశ అధికారిక మీడియా ఈ
విషయాన్ని వెల్లడించింది. భారత్-చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తతలు ముదిరిన నేపథ్యంలో
చైనా అధ్యక్షుడి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో భారత ప్రధాని
మోదీ కూడా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. లద్దాక్, అసోంలోని ప్రాంతాల్లో చైనా సరిహద్దు వెంట నెలకొన్న
పరిస్థితులు, చైనా
బలగాల కదలికలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఈ సమీక్ష సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు
అజిత్ దోవల్, త్రివిధ
దళాల ప్రధానాధికారి (సీడీఎస్) బిపిన్ రావత్, త్రివిధ
దళాల అధిపతులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్తోనూ
ప్రధాని మాట్లాడారు.
కరోనా వైరస్ వ్యాప్తి
విషయంలో అమెరికాతో తలెత్తిన వివాదం నేపథ్యంలో జిన్పింగ్ తాజా వ్యాఖ్యలు
చేసినట్లు తెలుస్తోంది. చైనాను కించపరిచే విధంగా అమెరికా రాజకీయ నాయకులు వ్యాఖ్యలు
చేస్తున్నారంటూ రెండు రోజుల కిందట చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ యి తీవ్రంగా
విమర్శించారు. కొవిడ్-19
వ్యాప్తి విషయంలో తమ దేశంపై వస్తున్న విమర్శలను చైనా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు
తెలుస్తోంది.
జాతీయ సార్వభౌమత్వాన్ని
కాపాడుకోవడం, దేశ
వ్యూహాత్మక స్థిరత్వాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యమని సైనిక బలగాలతో జిన్పింగ్
అన్నట్లు సమాచారం. చైనా అధ్యక్షుడు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినా భారత్
మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇప్పటికే లడక్, పాంగాంగ్ ప్రాంతాల్లో చైనాకు దీటుగా సైనిక బలగాలను
తరలించింది. యుద్ధ విమానాలను కూడా మోహరించినట్లు తెలుస్తోంది. సరిహద్దులో ఇరు
దేశాలు అదనపు బలగాలను మోహరించడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.
చైనా నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతున్న వేళ భారత సైన్యాధిపతి జనరల్ నరవాణే లడక్లో
పర్యటించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు కొనసాగిన ఆయన పర్యటనను ప్రభుత్వం
గోప్యంగా ఉంచింది. మంగళవారం నాటి ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన క్షేత్ర స్థాయిలో
వివరాలను ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది.