రామ జన్మభూమిలో తెరుచుకున్న తాత్కాలిక రామ మందిరం
By: chandrasekar Mon, 08 June 2020 8:25 PM
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రసిద్ధ ఆలయాలతోపాటు తాత్కాలిక రామ మందిరాన్ని సోమవారం తెరిచారు. దీంతో అందులోని దేవతా మూర్తులను భక్తులు దర్శించుకున్నారు. రామ జన్మభూమిలో కొన్నేండ్లుగా ఉన్న రాముడి విగ్రహాలను మార్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమం ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన చోటికి తరలించారు. కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకావడంపై విమర్శలొచ్చాయి.
వివాదస్పద రామజన్మభూమి రామ్లల్లాకే చెందుతుందని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు సూచన మేరకు రామాలయం నిర్మాణం కోసం కేంద్రం ఓ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సమక్షంలో ఏప్రిల్ నెలలో రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరుపాలని ట్రస్ట్ నిర్ణయించింది. అయితే కరోనా వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో మధురలోని ప్రసిద్ధ ఆలయాలను జూన్ 30 వరకు మూసి ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.