వినూత్నంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించిన తెలుగు దేశం పార్టీ నాయకులు
By: chandrasekar Mon, 15 June 2020 3:30 PM
రాష్ట్రంలో తెలుగు దేశం
పార్టీ నాయకులు వినూత్నంగా నిరసన ప్రదర్శన
నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం పార్టీ నాయకులపై
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కక్ష సాధిస్తున్నారని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. టీడీపీ నాయకుల అరెస్టులకు నిరసనగా
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఇందులో భాగంగా
రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి చంద్రబాబు నివాసంలో పార్టీ ముఖ్య నాయకులు
వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బొండా ఉమాతో కలిసి కాగడాలు పట్టుకుని నిరసన
తెలియజేశారు.
రాష్ట్రంలో వైసీపీ ఏడాది
పాలనలో కక్ష సాధింపు చర్యలే తప్ప చేసిందేమీ లేదని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా
పులివెందుల రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీ
నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ పార్టీ నేతలు నిరసన
వ్యక్తం చేశారు. గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ
మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ ఎంపీ మాగంటి బాబు వారి గృహాల వద్దే నిరసన
ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ
ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ను వెంటనే విడుదల చేయాలంటూ
కాగడాలతో నిరసన తెలియజేశారు. విశాఖలోనూ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు
కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. దీనిద్వారా తమ ఆవేదనను తెలియజేసిన తెలుగుదేశం
నేతలు.