- హోమ్›
- వార్తలు›
- సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై కసరత్తులు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై కసరత్తులు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
By: Sankar Tue, 25 Aug 2020 08:36 AM
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో గత ఆరు నెలలుగా స్కూల్స్ మూతపడ్డాయి..అయితే కరోనా ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు పెట్టాలని నిర్ణయించింది సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులను నిర్వహించడానికి కేసీఆర్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ (విద్యా) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామ్చంద్రన్ సోమవారం (ఆగస్టు 24) ఉత్తర్వులు జారీ చేశారు.
డిజిటల్, టీవీ, టీ-శాట్ లాంటి నెట్వర్క్ ఛానల్ ప్లాట్ఫాంల ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఇ-లెర్నింగ్, దూర విద్యలో భాగంగా అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు తిరిగి తెరిచి సాధారణ తరగతులు కొనసాగించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇంట్లో టీవీలు లేని విద్యార్థుల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో ఆన్లైన్ తరగతులు వినేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు నిర్దేశం చేశారు. ఆన్లైన్ తరగతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున టీవీలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసింది.
ఇక ఉపాధ్యాయులందరూ ఆగస్టు 27 నుంచి క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆన్లైన్ క్లాసులకు అవసరమైన ఇ-కంటెంట్, పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరిపించడానికి అవకాశం లేనందున.. విద్యా సంవత్సరంపై ఆ ప్రభావం పడకుండా ఆన్లైన్ తరగతులు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు నిర్దేశించింది.