కరోనా రికవరీ రేటులో జాతీయ సగటు కంటే ఎక్కువ సగటు నమోదు చేసిన తెలంగాణ
By: Sankar Thu, 30 July 2020 6:10 PM
దేశంలో వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు పది లక్షలకుపైగా ప్రజలు కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్లైన్ కార్మికుల అంకితభావంతో రికవరీలో ఈ మైలు రాయి సాధించామన్నారు. వైరస్ నుంచి 1,020,000 మంది రోగులు కోలుకున్నారని, ఇది గొప్ప విషయమన్నారు. రికవరీ రేటు ఏప్రిల్లో 7.85 శాతంగా ఉందని, ప్రస్తుతం 64.4 శాతంగా ఉందని చెప్పారు.
దేశంలోని 16 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ఢిల్లీలో 88శాతం, లడక్లో 80, హర్యానా 78, అస్సాం 76, తెలంగాణ 74, తమిళనాడు, గుజరాత్లో 73శాతం, రాజస్థాన్ 70, మధ్యప్రదేశ్ 69, గోవా 68శాతం నమోదైందని చెప్పారు. సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్మెంట్ మరణాల రేటు తగ్గేందుకు దారి తీసిందన్నారు. జూన్లో ఇది 3.33 శాతం, ప్రస్తుతం 2.21 శాతం ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యల్పమని చెప్పారు.
ఆర్టీ-పీసీఆర్, వేగవంతమైన యాంటిజెన్ పరీక్షలతో సహా దేశంలో 18,190,000 పరీక్షలు జరిగాయని చెప్పారు. రోజుకు సగటు పరీక్షల్లో వారానికి వారం పెరుగుదల ఉందని తెలిపారు. దేశంలో రోజుకు పది లక్షల జనాభాకు 324 పరీక్షలు నిర్వహిస్తుందని భూషణ్ పేర్కొన్నారు. దేశంలో రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయన్నారు..