తెలంగాణాలో ఆగని కరోనా విజృంభణ..1.50 లక్షలు దాటిన మొత్తం కరోనా కేసులు
By: Sankar Thu, 10 Sept 2020 10:13 AM
గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,176 కు చేరాయి. తాజాగా వైరస్తో 11 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 927కు చేరింది. తాజాగా వైరస్ నుంచి 2,071 మంది వైరస్ నుంచి కొలుకోగా, మొత్తం 1,17,143 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 25,066 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 25,066 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.68 శాతంగా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 78శాతంగా ఉందని, ఇది దేశ సగటు (77.83) కంటే ఎక్కువని పేర్కొంది. బుధవారం ఒకే రోజు 63,017 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 19,53,571 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 2,447 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 52,619 మందికి టెస్టులు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.
తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 327 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి 195, నల్గొండ 149, మేడ్చల్ మల్కాజ్గిరి 132, వరంగల్ అర్బన్ 124, కామారెడ్డి 123, ఖమ్మం 109, కరీంనగర్ 107, సిద్దిపేట 103 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.