తెలంగాణాలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
By: Sankar Wed, 26 Aug 2020 10:23 AM
తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఒకే రోజు మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,018 మంది కరోనా బారిన పడ్డారని తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది.
తాజాగా 10 మంది వైరస్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 780 కి చేరింది. గడచిన 24 గంటల్లో 1,060 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 85,223 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,685 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.92 శాతంగా ఉండగా.. తెలంగాణలో రికవరీ రేటు 76.30 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 10,82,094 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.
మరోవైపు తెలంగాణలో రెండోసారి పలువురుకు కరోనా వైరస్ సోకడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా.. కొవిడ్పై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యులు, నర్సులు, వైద్యసిబ్బందిలో కరోనా రీ-ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనపడుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలో ఒకరికి రెండోసారి వైరస్ సోకినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. ఈ రీ-ఇన్ఫెక్షన్ల బెడద కొద్దిరోజుల క్రితమే మొదలైనట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది