నిర్ణిత సమయం కంటే ముందే ముగియనున్న తెలంగాణ పోలీస్ క్యాడెట్ శిక్షణ
By: Sankar Fri, 26 June 2020 10:33 AM
కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి శిక్షణ తీసుకుంటున్న పోలీస్ క్యాడెట్లకు నిర్ణిత సమయం కంటే ముందుగానే పూర్తి అయ్యేలా ఉంది ..కరోనా దెబ్బకు సెమిస్టర్ సెలవులు లేకుండా నిరంతరాయంగా శిక్షణ కొనసాగుతుండటమే ఇందుకు కారణం. లాక్డౌన్ విధించిన తరువాత క్యాడెట్లు ఇంతవరకూ బాహ్య ప్రపంచాన్ని చూడలేదు. క్యాడెట్లు కరోనా బారిన పడకుండా దాదాపు 105 రోజులుగా అందరినీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీతోపాటు, జిల్లాల్లోని పీటీసీలకు పరిమితం చేశారు. ఎవరికీ ఔటింగ్ ఇవ్వడం లేదు. క్యాడెట్లను చూసేందుకు అకాడమీలోకి వారి తల్లిదండ్రులు, భార్యాపిల్లలను కూడా అనుమతించడం లేదు. మరీ అత్యవసరమైతే తప్ప బయటికి పంపడం లేదు.
రాష్ట్రంలో జనవరి 18న టీఎస్పీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీటీసీలలో దాదాపు 17,200 మంది పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమైంది. వీరికి అప్పట్లో కుటుంబ సభ్యులను కలుసుకునే వీలుండేది. మార్చి 8, 9వ తేదీల్లో క్యాడెట్లకు సెలవులు ఇచ్చారు. తరువాత అనుకోకుండా 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచి క్యాడెట్లకు కరోనా సోకకుండా ఔటింగులు ఆపేశారు. కుటుంబ సభ్యులను కలవనీయడం లేదు. వీరికి రెండు సెమిస్టర్లలో సిలబస్ పూర్తి అవుతుంది.
మే 8 నుంచి 14 వరకు సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వాలి. కానీ, బయటికి వెళితే.. కేడెట్ల ఆరోగ్యానికి ముప్పు ఉండటంతో సెలవులు రద్దు చేశారు. మే 8 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభించారు. వీరికి శిక్షణ ముగిసి పాసింగ్ ఔట్ పరేడ్ (పీవోపీ) అక్టోబరు 12న జరగాలి. సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వలేదు కాబట్టి పీవోపీ మరో వారం ముందుకు జరిగి అక్టోబరు 4 లేదా 5వ తేదీల్లో జరిగే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై ఇంకా ఉన్నతాధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.